మడత నాల్కది యూర్మిళమ్మ చెలి "బీడి
పడకు, సిగ రెట్టుకొనవే! మగ డరుదెంచుఁ,
గను లయొ! పొగాకు మండుఁ గూ చొనకు మిచట,
గుట్క తాగి వత్తు"న టంచు గొణిగె నపుడు
సీతా రామ లక్ష్మణులు రావణ వధానంతరం అయోధ్యకు తిరిగివచ్చారు. రామునికి వైభవంగా పట్టాభిషేకం జరిగింది. తోడికోడళ్ళలో ఒక్క ఊర్మిళయే పెద్దకాలం భర్తృ వియోగాన్ని భరించిం దని రాముడు ఆమె అంతఃపురాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించు మని ఆదేశించాడు. ఊర్మిళా లక్ష్మణుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, వారి పునస్సమాగమానికి యథోచితంగా ఏర్పాట్లు గావింపు డని చెలికత్తెలను పురమాయించాడు.
ఊర్మిళకు నాలుక మడత పడిన చెలికత్తె ఒకతె వుండేది. (అంటే చిన్నప్పుడే ప్రమాద వశాత్తు నాలుక ఒకింత మడత పడి అలాగే అతుక్కు పోయింది.) ఆమె మాటలు కొన్ని మన కర్థం కావు. కొత్తగా వింటాం కదా! (అక్క డుండేవాళ్ళు రోజూ వింటూవుంటారు కాబట్టి వాళ్ళకు అర్థ మౌతుంటాయి.) ఆమె ఊర్మిళతో ఇలా అన్నది.
"బిడియ పడకు. సిగ కట్టుకొనవే! మగడు వచ్చే వే ళయింది. అయ్యో! పొగకు కన్నులు మండుతున్నై. ఇక్కడ కూర్చోకు. నే నిప్పుడే గట్క (సంకటి) తాగి వస్తాను."
కాని ఆమె మాటలు మనకు వేరే విధంగా వినిపిస్తున్నాయి. ఆమె మాట తీ రది. ఏం చేస్తాం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి