భారతీయ సాహిత్యం- దళిత సంస్కృతి
దళిత కవులు, రచయితలు తమ అస్థిత్వం కోసం, ఆత్మ గౌరవం కోసం కలాలతో కవాతు చేస్తున్నారు. అనాధిగా జరుగుతున్న దాడులను ఖండిస్తూ కలాలో సిరాకు బదులుగా ఆక్రోశాన్ని, ఆవేదనన్ను అన్నింటికి మించి కసిని నింపుకొని సాహిత్య క్షేత్రములో కొత్త కొత్త పంటలని పండిస్తున్నారు. తన ఉనికిని, మనికిని గుర్తించని వ్యక్తుల మీద, వ్యవస్థ మీద ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. మనిషిని మనిషిగా గుర్తించని మను మనుషుల మీద వారి మనస్తత్వం మీద తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. వర్ణవ్యవస్థ, దేవుడు, విధి, ఆత్మ, పునర్జన్మ, స్వర్గనరకాలు వంటి భావాలతో కూడుకున్న హిందూమతాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ భావాల కారణంగా ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అణచివేయబడిన వారుగా విషయాన్ని దళితులు గుర్తించారు. దళితుల విముక్తికోసం హిందూమత తాత్త్వికతను మౌలికంగా ప్రశ్నించిన చార్వాకులు, బౌద్ధ, జైనాలు వారి శాస్త్రీయ దృక్పథం, దళిత సాహిత్యానికి అవసరమైన తాత్త్వికతను అందించింది.
దళిత సాహిత్యం ప్రాచీనమైన, సాంప్రదాయక స్వభావం కలిగిన సామాజిక నిర్మాణాన్ని తిరస్కరిస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలు ప్రాతిపదికగా నిర్మించబడే సమాజం పట్ల దళిత సాహిత్యం విధేయత కలిగి ఉంటుంది. స్థిరమైన అధికారాన్ని కొనసాగించే మనువాద సాహిత్యానికి ఇది వ్యతిరేకమైనది. దళితసాహిత్యం హేతువాద దృష్టిని కలిగి ఉండి పురాణ భావాలను, మత సిద్ధాంతాలు, అశాస్త్రీయభావాలు వంటివాటిని తిరస్కరిస్తుంది. వాస్తవిక ఆధారమైన భావాలతోనే సాహిత్యం ఉండాలంటుంది.
సమాజంలో సంస్కరణభావాలు రేకెత్తించే సాహిత్యం ఒక సాధనంగా ఉపయోగపడాలని దళితసాహిత్యం భావిస్తుంది. సాహిత్యం కేవలం వినోదం కోసం కాదని సామాజిక చైతన్యం కలిగించాలని భావిస్తుంది. అందుకే కళకళకోసమే అనే సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ కళ సమాజం కోసమే అనే దృక్పథం నుండి మాత్రమే సాహిత్యాన్ని సృష్టించాలని దళిత సాహిత్యం అభిప్రాయపడుతుంది. ఇందుచేతే దళితసాహిత్యంలో దళిత అనుభవాల స్పృహ కనిపిస్తుంది.
దళితసాహిత్యం అనుభూతి విశిష్టమైనది. జీవితాన్ని యధాతధంగా ప్రతిబింబించడం దాని లక్షణంగా కనిపిస్తుంది. ఈ లక్షణం సాహిత్యాన్ని సౌందర్యంతోను, ఔన్నత్యంతోను నింపుతుంది. అందువల్లనే మనం సామాజిక చైతన్యానికి, సౌందర్యాత్మకతకు మధ్య ఒక ప్రత్యేకమైన సమన్యయాన్ని దళిత సాహిత్యంలో గమనిస్తాం.
కుల, మత, వర్గ, ఆర్థిక, రాజకీయ, ఆధిపత్య స్వభావం నుంచి మనిషికి స్వేచ్ఛను కలిగించే దిశగా సాగడం దళిత సాహిత్యం లక్షణం. అంటే ఇది కులరహిత వర్గరహిత సమాజ స్థాపనకు ఉద్దేశిస్తున్నట్లు భావించవచ్చు. దళిత దృక్పథంలో జీవితమే సాహిత్యం కాబట్టి, సాహిత్యానికి ప్రజలకు మధ్యగల ఖాళీని పూరించేదిగా దళితసాహిత్యం పనిచేస్తుంది.
మానవతా వాదాన్ని వ్యతిరేకించే సాహితి సంస్కృతులపై దళిత సాహిత్యం నిర్విరామపోరాటం చేస్తుంది. మానవతా వాదం తన ప్రధాన ఇతివృత్తంగా దళిత సాహిత్యం ప్రకటించింది. అందుచేతనే మానవుడు కేంద్రంగా ఈ సాహిత్య సృజన జరుగుతున్నది. మానవుని కష్టసుఖాలలోపాలు పంచుకుంటూ అతనిలో విప్లవ చైతన్యం నింపడం ఇందులో చూడవచ్చు. ఇందుకోసం దళిత సాహిత్యం పీడితుల ఆశలు, ఆశయాలు, అనుభవాలు, అనుభూతులను చిత్రిస్తుంది.
అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సామాజిక ఆర్థిక న్యాయంకోసం పోరాడడం దీని ప్రధాన లక్షణం. అందుచేతనే దళితసాహిత్యాన్ని వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటుగా పేర్కొన్నారు. ఉనికి కోసం అన్వేషించటం దళిత సాహిత్యంలో మరో లక్షణం. కాబట్టే దళితుల ఐక్యత అవసరాన్ని ఇది గుర్తించింది. ఈ గుర్తింపు దళితుల సామాజిక చైతన్యానికి స్ఫూర్తినిచ్చింది. దళిత సాహిత్యంలో రెండు విభిన్న చైతన్య స్రవంతులను గమనించవచ్చు. ఒకటి మితవాద స్రవంతి. మరొకటి అతివాద స్రవంతి దళిత అనుభవాల వ్యక్తీకరణతో పాటుగా, కులవ్యవస్థలోని అమానవీయత, దురభిమానాలను వర్ణిస్తూ, నూతన సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని ఆశించడం మితవాద ధోరణిలో కనిపిస్తుంది.
అతివాద స్రవంతిలో మాత్రం వ్యవస్థపై తిరుగుబాటు, హిందుమతత్త్వం విధించిన పరిమితులను ధిక్కరించే ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. హిందుమతం మౌలిక తత్వాన్ని, అది ప్రచారం చేసే కర్మ, పరమాత్మ, పునర్జన్మ వంటి భావాలను ఈ ధోరణి తీవ్రంగా నిరసిస్తుంది. ఈ తరహా కవులు తమ కవిత్వంలో ఉపయోగించే ప్రతీకలు, అలంకారాలలో సమాజ స్వభావం పట్ల వ్యక్తం చేసే అసహనం, నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. అతివాద ధోరణి అధికంగా కవిత్వంలో ప్రతిబింబిస్తే, మితవాద ధోరణి ఎక్కువగా కథలలో, ఆత్మకథలలో ప్రతిఫలించడం గమనించవచ్చు. హిందుమత మౌలిక స్వభావ తిరస్కారం సామాజిక, సాంస్కృతిక మార్పు ఆశించడం అమానవీయత దురభిమానాల వర్ణన సమాజ స్వభావం పట్ల అసహనం ప్రస్తుత జీవితాన్ని తిరస్కరించడం వ్యవస్థపై తిరుగుబాటు, ధిక్కారం, సంస్కరణ అభివృద్ధి ఆకాంక్షించడం ఉంది.
తిరుగుబాటు, ధిక్కారం జాషువ నుంచే మనం చూస్తాం. జాషువ “కసరి బుసకొట్టుట నాల్గు పడగల హైందవ రాజు” అని వర్ణవ్యవస్థ క్రూరత్వాని వెల్లడించాడు. అంతే కాదు
“ముసలివాడైన బ్రహ్మకు బుట్టినారు
నల్వురు కుమారులను మాట విన్నాముగాని
పసరముకన్న హీనుడభాగ్యుడైన
ఐదవకులస్తుడెవరమ్మా సవిత్రి”
అంటూ పంచవవర్ణం పుట్టుక గురించి ప్రశ్నిస్తాడు జాషువా. అట్లాగే అస్థిత్వం ఆత్మగౌరవం కోసం కలేకూరి ప్రసాద్ “పిడికెడు ఆత్మగౌరవం కోసం” అనే కవితలో
“ఇప్పుడు కరుడుకట్టిన భూస్వామ్యక్రౌర్యం
నాగుండెలమీద నాగేటి కర్రులతో
పచ్చబొడిసిన పేరు చుండూరు
ఇక చుండూరు నామవాచకంకాదు సర్వనామం
ఇప్పుడు ప్రతిగుండే రగిలే రాచపుండూరు
నేను జనసమÖహాల గాయాన్ని గాయాల సమÖహాన్ని
తరతరాలుగా స్వతంత్రదేశంలో అస్వతంత్రుణ్ణి
అవమానాలకూ, అత్యాచారాలకూ
మానభంగాలకూ, చిత్రహింసలకు గురై
పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తిన వాణ్ణి
ధనమదాంధ, కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకుతున్నవాణ్ణి
బతికేందుకు పదేపదే చస్తున్నవాణ్ణి
అంటూ ఆత్మగౌరవం కోసం బ్రతకటం కోసం దళితులు నిరంతరం ఎదుర్కొంటున్న హింసను ధిక్కార స్వరంతో వేదనాబరితంగా ఆవిష్కరించాడు.
ఎండ్లూరి సుధాకర్ ‘దళితాయణం’ అనే ఖండికలో
శంబూకుడు సింహాసనం మీద నుంచి
నల్లసూర్యుడై నవ్వుతుంటే
వర్తమానవాల్మీకి తన దళితాయణంలో
మొదటి వాక్యం ఇలా రాశాడు.
దళిత యుగం శంబూకునిరక్త స్వప్నం
అనే మాటల్లో రాజ్యాధికార స్వప్నం కనిపిస్తుంది.
దళిత ధిక్కార స్వరానికి శివసాగర్ ‘నడుస్తున్న చరిత్ర’ కవిత ఒక గొప్ప
ఉదాహరణ. అణగదొక్కిన పురాణ పాత్రలపై ప్రతీకారం తీర్చుకోవడం ఇందులో కనిపిస్తుంది.
శంబూకుడు పెదాల మీద చిరునవ్వుతో
రాముని వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుడి బొటనవేలును
గొడ్డలితో నరుకుతున్నాడు
బలి తన చిరుపాదాలతో వామనుణ్ణి
పాతాళానికి తొక్కేస్తున్నాడు
మనువు కళ్లల్లో సూదులు గుచ్చుకుని
నాలిక తెగ్గోసుకుని
చెవిలో సీసంపోసుకుని
శ్మశానంలో దొర్లుతున్నాడు
అంటూ సాగే కవితలో ధిక్కార స్వర తీవ్రత కనిపిస్తుంది.
ఇదే తీవ్రతా సతీష్ చందర్ ‘పంచమవేదం’ లో కనిపిస్తుంది.
భాషా ఆప్రవీణులారా ఉలిక్కిపడకండి
మీరుకుదిర్చిన చందోబద్దకావ్యాలను కాలదన్ని
వర్ణ క్రమాలు వాడలకు వలసపోతున్నాయి
పదాలకిప్పుడు నలుగు పెట్టాలి
నూలు పోగులు లేకుండా నగ్నపరచాలి తరతరాలుగా సాహిత్య సృజన భాషా పాండిత్యం ఒక వర్గంవారి గుప్పెట్లోనే వుంది. దళిత సాహిత్య ఆవిర్భావంతో అది విముక్తి అయింది. అలాగే ప్రసాదమÖర్తి ‘అవధానిగారు అవధరించండి’ అనే కవితలో
అక్షరం ఇప్పుడు
కులంతక్కువ వాడి ప్రక్కలో
కులుకుతోంది
అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించాడు.
జులూరి గౌరీశంకర్ మనుషులు వివిధ అంశాలనుంచి పుట్టారన్న అశాస్త్రీయతను ఎండగట్టాడు.
అసలు ఏ వర్ణానికైనా
జన్మస్థానమొక్కటే
మనుషులు మనుషులుగా పుట్టుక
మనువులై పుడితేనే ప్రమాదం
కొందర్ని పాదాలనించి పుట్టించే ప్రమాదం
మనిషి మనువైనప్పుడే జరిగింది
అని మనిషి మనువైన దుర్మార్గాన్ని బహిర్గతం చేస్తాడు.
నగేష్ బాబు తన దీర్గ కవిత ‘రచ్చబండ’లో
ఇప్పుడు మాత్రమే కాదు
ఇక వీచేగాలులం మేమే
అవును ఇది కొత్తగాలే
ఆకులు కాదు ఆత్మలువీస్తున్న గాలి
చెట్లుకాదు చేవదేలిన దేహాలు వీస్తున్న గాలి
ఇన్నాళ్లు పవిత్ర గ్రంథాల ఇనుపజాడీల్లో
మీరు భద్రంగా దాచిన బహుజన ప్రభంజనం
ఇన్నాళ్లు ఏమనుషుల్ని నిషిద్ధుల్ని చేసి
అసింట అసింట అని జరిగిపోయారో
ఏ మనుషుల్ని పనిముట్లని చేసి
మీ పనులన్నీ చక్కదిద్దుకున్నారో
ఏ మనుషుల్ని మీ బూటకాల చరిత్రకు
యోజనాల దూరం ఉంచారో
ఆ మనుషులే చరిత్రలు రాస్తున్నారు
అంటూ తన తిరుగుబాటు స్వరాన్ని వినిపించాడు. మరో చోట ఎండ్లూరి సుధాకర్ ఇలా అంటాడు.
ఈ పంచ భూతాల తోలుదొలచి
ఆకాశానికో మేకు / పాతాళానికో మేకు
సప్త సముద్రాల మీద
చర్మాన్ని నానబెట్టిన నీకు ఆ సూర్యచంద్రులు
చెరో చెప్పూ కావాల్సిందే
ఆకలితోనో అవమానంతోనో
తలవొంచుకుని
నీ చర్మపుజోళ్ళు కుట్టుకుంటున్నతాతా
ఈ ప్రపంచం / ఉంగటంగామారి
నీ ముంగాలి బొట్టినేలిని
ముద్దుపెట్టుకోవాలని
కలగంటున్నాను
అని చెప్పటంలో దళిత చైతన్యం కనిపిస్తుంది.
ఈ దిశలో దళిత సాహిత్యం విస్తృతమైన కృషి చేసింది. దళితేతరులైన ఉన్నత వర్గాలు దళితుల గురించి ఆలోచించేట్లు చేసింది. దళితుల మానసిక దాస్య విమోచనం కోసం ప్రయత్నించడం దళితసాహిత్య మరో ప్రధాన లక్షణం. దళితులు, తామంతా ఒకజాతి అని గుర్తించేందుకు తమ వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకోగల చైతన్యాన్ని కలిగించేందుకు ఈ సాహిత్యం కృషి చేస్తుంది. నిజాయితీ విమర్శనాత్మక ధోరణి కలిగిన దళిత సాహిత్యం దళితులలో గల ఆత్మ న్యూనతా భావంపై దాడిచేసి వారు బానిస మనస్తత్వం నుండి విముక్తి చేసేందుకు సహకరిస్తుంది. దళిత సాహిత్యం జీవిత వైవిధ్యాలన్నింటిని విభిన్న కోణాలలో దర్శించే స్వాభావాన్ని కలిగి ఉండి జీవితాన్ని విప్లవీకరించే దిశగా పయనిస్తున్నది.
కులవర్గ వైరుద్ధ్యాలతో నిండి ఉన్న ప్రాచీన హిందూ మార్మికతను బ్రద్దలు చేస్తూ, అందుకు ప్రతిగా ప్రత్యామ్నాయ సంస్కృతిని రూపొందించడం దళిత సాహిత్యం తన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం ప్రతిపౌరునికి అందించగల నూతన వైజ్ఞానిక వ్యవస్థ దళిత సాహిత్య ఆశ.
దళిత సమస్యలను అర్థం చేసుకొని అందుకు కారణమైన వాస్తవాలను విశ్లేషించడం, ఆ సమస్యలసాధనకు ఉపకరించే సామాజిక, అభ్యుదయ శక్తులను ప్రోత్సహించటం, తద్వార శతాబ్దాలుగా అజ్ఞానంలో ఉంచబడిన వారిలో సామాజిక, రాజకీయ చైతన్యం కలిగించటం దళిత సాహిత్యం ప్రధాన లక్ష్యంగా భావించవచ్చు.
సామాజిక అభివృద్ధిలో భాగంగా వ్యక్తి అభివృద్ధి కోసం, జాతి నిర్మాణం కోసం దళిత సాహిత్యం ప్రయత్నిస్తుంది. మానవతావాద దృక్పథంతో, విశ్వజనీన సౌభ్రాతృత్వం లక్ష్యంగా మొత్తం మానవజాతి అభ్యున్నతే ధ్యేయంగా దళిత సాహిత్యం సాగుతున్నది.
వ్యక్తి సమాజంలో భాగమైనప్పుడు సామాజిక అంశాలు అతని వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. అలానే అతని వ్యక్తిత్వం కూడా సమాజంపై ప్రభావం చూపుతుంది. ఆ వ్యక్తి రచయిత అయితే ఆ రచయిత సృజించే సాహిత్యం సమాజంపై తన ప్రభావం చూపుతుంది. అందుచేత సాహిత్య అధ్యయనంలో రచయిత వ్యక్తిత్వం రచయితగా ప్రముఖపాత్ర వహిస్తుంది. సామాజిక స్పృహతో రచన చేయటం రచయిత బాధ్యత మాత్రమే కాదు. అది అతని విధి. సాధారణ రచయితకు దళిత రచయితకు ఆలోచనల్లో మాత్రమే కాకుండా అనుభవాలలో, వస్తువు, శైలి భాషలలో సైతం కనిపించే వైరుధ్యం వారి జీవన చిత్రణలో, పాత్రల చిత్రణలో కూడా కనిపిస్తుంది.
దళితసాహిత్యం దోపిడిని, పీడనను వ్యతిరేకిస్తుంది. కాబట్టి దళిత రచయితలు దోపిడి వ్యవస్థకు చెందిన సామాజిక విలువలను అంగీకరించరు. దళితుల సాంస్కృతిక, సామాజిక, ఆర్ధిక, రాజకీయ అభివృద్ధి విషయంలో సాహిత్యానికి గల బాధ్యతను వీరు గుర్తించారని భావించవచ్చు.
ఇదివరకే స్థిరపడిన సాహితీ విలువలను, ‘కళ, కళకోసమే’ అన్న సిద్ధాంతంపై ఆధారపడి జరుగుతున్న విమర్శ పద్ధతులను దళిత రచయితలు తిరస్కరించారు. కళ లేదా సృజన యొక్క విలువను గణించటంలో సాంప్రదాయక పద్ధతులను వీరు అంగీకరించలేదు. వీరు జీవితంలో, సాహిత్యంలో సాంప్రదాయక విలువలకు వ్యతిరేకంగా ఉద్యమించారు.
దళిత రచయితలు దళిత సంస్కృతీ వారసత్వాలను, వాని ఔన్నత్యాన్ని స్థాపించే ప్రయత్నం చేయటం ద్వారా చరిత్రను సృష్టించదలచుకున్నవారు చరిత్రను విస్మరించకూడదు అన్న దానికి కట్టుబడినారు. సాహిత్యాన్ని వీరు వినోదంగా భావించలేదు. దళిత రచయితల మహాసభలో వీరు ఈ అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం.
కవితా ప్రక్రియలో దళిత కవిత్వం అనేకమైన మౌలిక మార్పులను ప్రవేశపెట్టింది. జీవితం పట్ల స్పష్టమైన భావనలు కలిగిన దళిత కవిత్వం కవితాలోకం యొక్క పరిధులను విస్తృత పరిచింది. సాధారణ కవిత్వం గుర్తించని వ్యక్తిత్వాలను, జీవన విధానాన్ని దళిత కవిత్వం గుర్తించింది. అన్యాయాలను, అసమానతలను, సమర్ధించిన వారికి వ్యతిరేకంగా తన స్వరం వినిపించింది. దళిత జీవితంలోని సుఖ, దుఃఖాలు మొదటిసారిగా శక్తివంతంగా కళాత్మకంగా కవిత్వంలోనే వ్యక్తీకరించబడినాయి. దళిత జీవితానికి విధేయంగా ఉన్న కారణంగా దళిత కవిత్వంలో దళిత అనుభవాల ప్రతిఫలనం కనిపిస్తుంది. దళితకవి స్వీయ అనుభవాల నుండే పదాలు, ప్రతీకలు స్వీకరించి కవితా నిర్మాణం చేస్తాడు.
దళిత కవిత్వం ప్రాధమికంగా మానవజీవితం కేంద్రంగా, సాగి కుల మత వర్గ జాతి ప్రాంతీయ పరిమితులన్నింటిని అధిగమించింది. దళిత కవిత్వంలో వ్యక్తీకరణ కేవలం వ్యక్తిగతమైనదిగా మాత్రమే కాకుండా విశ్వజనీనమైనదిగా ఉంటుంది. దళిత కవిత్వంలో సంభాషణ రూపంలో, వర్ణనాత్మకంగాను దళిత జీవితం వ్యక్తీకరించబడుతుంది. దళిత కవులు సామాజిక అమానవీయత గురించిన వార్తలను పత్రికలలో చదివి స్పందించి వాటికి కవితారూపం కల్పించటం దళితకవిత్వంలో సాధారణాంశం. మతం కంటే దేవతావిగ్రహాల కంటే, ఏ ఇతర భావాల కంటే కూడా మానవుడే విలువైన అంశంగా భావిస్తూ ఆ దిశగా సమాజ ఆలోచనలలో మార్పు తెచ్చేందుకు దళిత కవిత్వం ప్రయత్నిస్తున్నది.
ఈ విధంగా సామాజంలోని నియంతృత్వ భావాల్ని, పోకడల్ని ఖండిస్తూ దళిత కవిత్వం మÖడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.