TELUGU PEOPLE CHOICE
Useful Guide for Hyderabad Telugu People...General Awareness for All ...Education....Movies.... Politics... Social...Cultural.....Events.....and many more things to know updates......
మొత్తం పేజీ వీక్షణలు
15, జూన్ 2026, సోమవారం
14, జూన్ 2026, ఆదివారం
ప్రతాపరుద్రకోట చరిత్ర - విశేషాలు
ప్రతాపరుద్రకోట
తెలంగాణలో ఒకపుడు కనకతార, జయంత, జయపాల అనే నాటకాలు ప్రసిద్ధంగా ఉండేవి. ఇవి ఏ కాలంనాటి కథలో తెలియదు కాని కాలగర్భంలో ఆనాటి రాజులు మరియు రాజ్యాలు కలిసిపోయి వారి కథలు మాత్రం మిగులుతుంటవి.
పైరెండు కథలు ఒకపుడు ప్రతాపగిరసీమలోని పట్టభద్రుని కోటకు చెందినవేనని గత శతాబ్దంనాటివరకు ఆనాటి వృద్దులు చెప్పుకునేవారు.
ఇది నాగర్కర్నూల్జిల్లాలోని మున్ననూరుకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటగోడ పొడవు 120 మైళ్ళని శ్రీ సయ్యద్గౌస్ తహసీల్దార్గారు చెప్పినారు. ఆ గోడ దాదాపు ఈ పీఠభూమి మొత్తము చుట్టుతుంది. దాని చివరలు కృష్ణానదిని కలుస్తాయి.
దీనికి ప్రతాపగిరికోట, పటాభద్రకోట, పటాల భద్రత కోట, ప్రతాపరుద్రకోట అని వ్యవహారాలు. ప్రస్తుతం ఈ కోట ఉన్న కొండకు ‘ప్రతాపగిరి’ అనే పేరుండేదని రాయనిగండి శాసనం వల్ల తెలుస్తుంది. ఆ ప్రతాపగిరిపై ఉంది కాబట్టి దీన్ని మొదట ప్రతాపగిరికోట అన్నారు. ఈ పేరుతో ప్రస్తుం నల్లగొండ జిల్లాలో గూడ ఒకటి ఉంది. దాన్నిపుడు సిరిసెనగండ్ల అంటున్నారు.
ఈ గిరిపై మొదట నివాసం పెట్టినవాడు ఎఱుకు దేవరాజు. అతని జన్మభూమి శ్రీశైలాటవి. ఇతడు సోమదేవరాజు కుమారుడైన మాధవవర్మ సమకాలికుడు. అతని కాలం వరకు అనుమకొండ నేటి (హనుమకొండ) అనే రాజ్యాన్ని పాలిస్తుండగా మాధవవర్మ పద్మాక్షీదేవిని గురించి తపస్సు చేసి ఆ దేవిచేత ఖడ్గంపొంది ఆ ప్రాంత ప్రజలను సమీకరించి ఒక సైౖన్యాన్నేర్పరచుకొని వారితో అనుమకొండపై దండెత్తి దాన్ని ఆక్రమించుకున్నాడు.
అపుడు దాన్ని పాలిస్తున్న ఎఱుక దేవరాజు మరి నా పరిస్థితి ఏమిటని అడిగినాడు. అతనికి అనుమడు, కొండడు గర్గళుడు (గర్గుడు) అనే ముగ్గురు కుమారులు ఉండేవారు. వారిలో అనుమడు, కొండడు అనే వారి పేరుతో ఏర్పడిందే అనుమకొండ. అపుడు ఎఱుకు దేవరాజు మొర విని మాధవవర్మ పెద్ద కొడుకులిద్దరిని తన సైన్యంలోకి తీసుకొని వారికి సేనాపతి పదవులిచ్చి గర్గనితో నీవు ప్రతాపగిరికి వెళ్లి ఆ ప్రాంతాన్ని రక్షించు. అది కూడ మా రాజ్యంలోనిదే. నాది గుంటూరుసీమలోని కందరపురం. మా తండ్రి సోమదేవరాజు. ఆయన శతృవులతో యుద్ధంలో మరణించినాడు. నేను ఆయన కుమారుడను. మాకు పశుసంపద ఎక్కువ కాబట్టి మా గోవులన్నీ ప్రతాపగిరికొండపైగల అడవులలోనే ఉంటవి. అందువల్ల నీవక్కడికి వెళ్లి ఆ ప్రాంతాన్ని చూడు అన్నాడు. అపుడతడు ప్రతాపగిరి కొండకు వచ్చి దాన్ని కేంద్రంగా చేసుకొని ఆ పీఠభూమిలో మొదటి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినాడు.
ఈ ఎఱుకు దేవరాజు విషయం మనకు కాసె సర్వప్పయొక్క సిద్దేశ్వర చరిత్ర పీఠికలో వస్తుంది. దాన్ని ఆచార్య ఖందవల్లి లక్ష్మీరంజనంగారు పరిష్కరించినారు. దాని పీఠిక తెలుగులో శ్రీ గోలి ఈశ్వరయ్యగారి పష్టిపూర్తి సంచికలో ప్రచురింపబడింది.
ప్రతాపగిరి పీఠభూమికి ఆవిధంగా ఎఱుకు దేవరాజుచే వచ్చేనాటికి కేంద్రంలో శాతవాహనులున్నారు. ఆ వంశంలోని రెండవపులోమావి బలహీనుడు. అతని కాలం క్రీ.శ. 120-153. ఎపుడైనా కేంద్రం బలహీనంగా ఉండే సామంతులు స్వతంత్రులు కావటం సహజం కనుక ఈ పులోమావి కాలంలో ఎఱుకు దేవరాజు ఎపుడో ఒక సమయం చూచి స్వతంత్రుడైనాడు. కాని అనంతరమెంత కాలం పాలించినాడో తెలియదు.
కేంద్రంలో శాతవాహనుల పిమ్మట ఇక్ష్వాకులు ప్రభువులైనారు. వారి కాలంనాటికి మున్ననూరు ప్రాంతంలో విష్ణుకుండినులనే ఒక పాటినాయక వంశం ఒకటుండేది. వారు ఇక్ష్వాకులకు విధేయులై ఉండేవారు. అందువల్ల ఇక్ష్వాకులు ప్రభువులు కాగానే అమరావతి నుండి ఎఱుకు దేవరాజును ఉడిమళ్ల రాజ్యానికి పంపి దీనికి విష్ణుకుండినులను సామంతులుగా చేసినారు. అంతవరకక్కడ అమరాబాదు పెద్ద ఊరుగా లేదు. కాని విష్ణుకుండినులు మొదట మున్ననూరు ప్రాంతంలోనే ఉన్న ఆ పీఠభూమికంతా అమరాబాదు కేంద్రస్థానంలో ఉందని దానిపై కన్నుపడి ఆ గ్రామాన్ని అభివృద్ది చేసి తాము ఇంద్రశబ్ద పాద్యులు కనుక ఆ గ్రామానికి ‘అమరావతి’ అని పేరు పెట్టినారు.
అంతవరకు అక్కడ లోకేశ్వరం అనే ఒక జైనవసతి ఉండేది. కాని విష్ణుకుండినులు శ్రీశైలేశుని భక్తులు కనుక వీరి ముందు ఇంక వారు నిలువలేకపోయినారు.
అమరావతి అనే పేరు మొదటిసారిగా ఈ అమరాబాదుకే పెట్టబడింది. కృష్ణాతీరంలోని అమరావతికి మొదట ధాన్యకటకం, ధరణికోట అని పేర్లు. దాన్ని వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు తీసుకున్న తర్వాత అమరావతి అని పేరుపెట్టినాడు.
శ్రీ బి.యన్. శాస్త్రిగారి చరిత్ర ప్రకారం విష్ణుకుండిన వంశమÖల పురుషుడు మహారాజేంద్రవర్మ. అతడు శాలంకాయన, పల్లవ, ఆనందగోత్రులు పరస్పరం కలహించుకుంటున్న సమయం చూసి అమరాబాదులో స్వతంత్రరాజ్యాన్ని స్థాపించినాడన్నాడు.
ఈ విష్ణుకుండినుల కంటె మొదట ఇక్ష్వాకులు రాజ్యానికి రాగానే ప్రతాపగిరి సీమను గూడ అక్రమించుకొని అక్కడి నుండి ఎరుకు దేవరాజును ఉడిమిళ్ల రాజ్యానికి పంపిన తర్వాత తమ అధికారాన్ని పొందిన ఒక అధికారి పాలకునిగా నియమించారు. అతని పేరోమిటో తెలియదు. ప్రభుత్యాధికారాన్ని పొందినాడు కనుక ప్రజలతన్ని పట్టభద్రునిగా గుర్తించినారు. మొదటిసారిగా ఈ పట్టభద్రుడే ప్రతాపగిరిపై ఎరుకు దేవరాజాక్రమించుకున్న చదరపు స్థలం చూసి అది కోటకు అనువుగా ఉందని అక్కడ ఈనాటి ప్రతాపరుద్రకోటకు ముగ్గు పోసినాడు. అక్కడ లభించే ఇటుకలను బట్టి పురాతత్వ శాస్త్రజ్ఞులవి ఇక్ష్వాకుల నాటివనే నిర్ణయించినారు.
విష్ణుకుండినుల జన్మస్థానాన్ని గురించి వాదవివాదాలున్నవి కాని శ్రీ బి.యన్. శాస్త్రిగారు వానినన్నిటిని త్రోసిరాజని వారి జన్మభూమి మున్ననూరు ప్రాంతమని నిర్ధారించినాడు. వారు తమను శ్రీ పర్వతస్వామి పాదానుధ్యాతులమని చెప్పుకున్నారు. శ్రీ పర్వతమనగా శ్రీశైలము. అంతేగాక నేటి నాగార్జున సాగరం దగ్గర విజయపురికి గూడ ఆ పేరుంది. అదే ఇక్ష్వాకుల రాజదాని గూడా అది అక్కడ ఒక పర్వతం పైననే ఉంది. దానికి కుందేళ్లబోడు అని ప్రజావ్యవహారం కాని అక్కడ నాగార్జునాచార్యుడనే గొప్ప బౌద్ద ప్రవక్త నివసించి దానికి శ్రీపర్వతమని పేరు పెట్టినారు. కాబట్టి ఇది ఏది ఏమైనా విష్ణుకుండినుల జన్మస్థానం మాత్రమే మున్ననూరు ప్రాంతమే అవుతుంది. అయితే వారి ఇంటి పేరుకు కారణమైన విష్ణుకుండి ఎక్కడ ఉందో ఇంకా తేలలేదు.
ప్రతాపగిరి సీమ ప్రదేశంలో ఈనాటి తలుపుల కురువకు ముందు బ్రహ్మగుండం ఒకే దిగుడు బావి ఉంది. అది బ్రహ్మకుండి, మున్ననూరులో మొదట ‘కాలపానీ’ నల్లని నీరు ప్రసిద్ధి. ఆది మొదట ఒక హ్రదంగా ఉండేది. ఈనాడు బావిరూపాన్ని ధరించింది కాబట్టి శ్రీపర్వత పురాణం పండితారాధ్యచరిత్రలో పేర్కొనబడిన కాలహ్రదం ఇదేనని నేను నమ్ముతున్నాను. విష్ణువు నల్లనివాడు. ఈ ‘కాలాపానీ’ అనగా నల్లని నీళ్లగుండమే. విష్ణుకుండి కావటానికి అవకాశం ఉంది. ఈనాడు కృష్ణలో ఇవతలి దరిలో యాత్రికులకు దానిని దాటడానికి జాతర రేవు, నీలగంగరేవు అని రెండు రేవులు ప్రసిద్ధంగా ఉండేవి. గోదావరి’కి తెలివాహ అని పేరున్నట్లు శ్రీ పి. పరబ్రహ్మశాస్త్రి గారు పేర్కొన్నారు. కనుక అది తెల్లని గంగ కాగా ఈ కృష్ణానది ‘నీలగంగ’ అయింది.
ఈ రేవు వెంట కొంత మేర నీరు నల్లగానే కనిపిస్తుందట. ఆనాటి పశుకాపరులు ఆక్కడక్కడ మడుగులను గురించి చిన్న చిన్న ప్రవాహాలను గురించి చెప్పుతుండేవారు. ఇదంతా నల్లమల ప్రాంతం. కనుక ఆ యొక్క భూమి గుణాన్ని బట్టి ఇక్కడినీటికి గూడ కొంత మేర ఆ గుణం సోకింది అనవలె.
ఇక తరువాతి కాలంలో ఈ కోటను కేంద్రంగా చేసుకొని అమరాబాదు పీఠభూమికి చుట్టు ఈనాటి ప్రతాపరుద్రకోట ఒక పెద్ద ప్రాకారంగా కట్టబడింది. పాలమÖరు జిల్లాలో కోయిలకొండ, గణపురం, పానుగల్లు అనేవి గిరిదుర్గాలు. ఆక్కడ కొండల పైననే కోటలు కట్టబడినవి కాని అవి ప్రతాపరుద్ర కోటవలె కొండ చుట్టు ప్రాకారం కట్టబడిన రాజ్యాలు కావు.. కాగా ఈ ప్రతాపరుద్రకోట ముఖద్వారం పానుగంటికోట ముఖద్వారం రెండు ఒకే విధంగా ఉన్నవి. రెండింటిపై సంస్కృత ఓంకారముంది. ఇదొక యాదృచ్చిక సంఘటన. అనాడీ ప్రాకారం లోపల అమరావతి ఉడిమిళ్ల అనే రెండు రాజ్యాలుండేవి. ఆ రెండింటి నడుము ఈనాటి పదర సమీపంలోని పె¹ద్దేటి రేగడిలో ఒక పెద్దనది పారేది. ఆ నది అనవాళ్లు అంటే అలల తాకిడికి అలలు అలలుగా అరిగిన బండచెక్కలు మనకు ఆ రేగడిలో లభిస్తవి. కాని అ నది పేరేమిటో తెలియదు.
ఇప్పటికి వర్షాకాలంలో అక్కడ ‘పులిమొత్త’ అనే ఒక కాలువ సాగుతుందట. ఆ రేగడికి చివరన ఒక పెద్ద లోయ ఉంది. దాన్నిపుడు ‘భైరవనెల’ అంటున్నారు. ఆ నెల ఆనాటి పెద్దేరు దూకియే నేలను కోసి ఏర్పడింది. ఈ లోయకు రెండు వైపులా రెండు గట్లు కొండపై అంచులుగా నిలిచినవి. నది ఆ గుట్టల నడుమ నుండి ఆనాడు ఎంత పెద్దగా పారేదో కాని ఇప్పటికి ఒక కాలువ రూపంలో దాని అవశేషం ఉంది. వర్షాకాలంలో అది కొంత విస్తరిస్తుందట గూడ. పదర నుండి భైరవనెలలోనికి దిగితె దేవరకొండ సరిహద్దు వస్తుంది. అందుకే కాబోలు భైరవనెలలో భైరవప్రతిష్ట ఉండేది. ఈ కారణంగానే మొదటి జిల్లాబందీలో అమరాబాదు నల్లగొండకు చేర్చబడి ఉండగా తరువాతి కాలంలో సక సాలార్ జంగు నల్లగొండజిల్లా పెద్దదై రెవిన్యూ పరిపాలన కష్టమైనందున దాన్ని చీల్చి అమరబాదు పట్టీని నాగర్ కర్నూలు జిల్లాకు కలిపినాడు.
ప్రతాపరుద్రకోట బాగా ఉన్ననాడు కోటలోపల ఒక గ్రాముమే ఉన్నది. ఆ కోటపై రాచమల్లు వారనే కాపరులు రాత్రింబవళ్లు కాపలా ఉండేవారు. అందుకు వారికి శ్రీశైలాటవిలో కొంత పొలం ఒక బావి ఇనాముగా నున్నవి. దాన్ని రాచమళ్ల బావి అంటున్నారు. ఆక్కడ రాచమల్లు బావి ఇప్పటికి ఉంది. అది చక్కగా రాయి కట్టబడి ఉంది. ఆనాడు దాని ప్రాకారద్వారం ఈనాడు తలుపుల కురువ అంటున్నారు. రాత్రివేళ మొదటి జాము కాగానే దాని తలుపులు మÖసేవారట అక్కడ ఒక భేరి ఉండి తలుపులు వేసే మొదట ఆ భేరిని ఒకటి రెండు దెబ్బలు వేసి మ్రోగించే వారట. అపుడాదారిని అమరాబాదు, పదర, వంకేశ్వరం మొదలైన గ్రామాలకు వెళ్ళ వలసిన బాటసారులు ఆ భేరీ మ్రోత వినగానే గబగబా పరుగెత్తుకొని వెళ్లి ద్వారం దాటి పడుకొని తెల్లవారు జామున లేచి వెళ్లవలసిన గ్రామాలకు వెళ్లేవారట. ఆనాటి కాపలాదారుల వంశాలిపుదు అమరాబాదు సమీపంలోని తెలుగు పల్లెలో ఉన్నవి.
ప్రతాపరుద్రకోట బస్తీగా ఉన్న కాలంలో దానిలోనికి వెళ్లటానికి ప్రా జ్ముఖంగా మాచారం వైపు నుండి బండిదారి ఉంది. అది నాపరాయి పరిచినట్లు కొండరాయి పరిచి గట్టిగా తాటించబడింది. ఆనాడు దొబ్బుడు బండ్లు వడ్డెర బండ్లపై కోటలోనికి కావలసిన సామాను వెళ్లుతుండగా మనుష్యులెడ్ల బండ్లపై వెళ్లేవారట.
కోట ముఖద్వారం ముందు ఆనాడు కాపలా దారులున్న గదుల అవశేషాలిప్పటకి ఉన్నవి. లోపలికి వెళ్లగానే కుడివైపున అంజనేయుని గుడి దానికి కొంత దూరంలో ఆనాటి మోటబావి ఉంది. అది చక్కగా రాయి కట్టబడింది. ఎడమవైపున వేణుగోపాలస్వామి ఆలయం దాని వెనుక చిన్నపాటి కుంట ఒకటి ఉన్నవి. అపుడిక్కడ రక్షణ శాఖా మంత్రులు మరియు వారి బలగం మాత్రమే ఉండేదట. వారు నివసించిన ఇండ్లు వానిలో ఆనాటి రోళ్ళు గూడ ఉన్నవి.
కోట ముఖద్వారం తూర్పు ముఖం కాగా బహిర్ద్వారం దక్షిణాభిముఖంగా ఉండి దానికి ఎత్తయిన తలుపులుండేవి. వాని గుసులు, తలుపులు తెరుస్తు మÖస్తు ఉండటంలో అవి విరిగి ఏర్పడిన గుర్తులు గల బండలు గూడ ఇపుడక్కడ ఉన్నవి.
కాకతీయుల అనంతరం ముహమ్మదీయుల దాడులు దేశంపై ఎక్కువ కాగా దేశంలో గ్రామాలు కొంత ఏ కాస్త పెద్దవైనా అక్కడి రాజులు, దొరలు లేదా జాగిర్దార్లు, మఖ్తేదార్లు తమ రక్షణ కోసం కోటలు కట్టుకొనటం ప్రారంభించినారు. ఆ కోటలో దొరలు వారి సేవక పరివారం మజ్జిన, భోజన, శయనశాలలు, విడుదులు, ఆటస్థలాలు, అశ్వశాల, గజశాలలు వీని కన్నిటికి సరిపడ ఆవాసాలకు, ముగ్గుపోసుకున్న పిమ్మటనే ఇక దాని చుట్టు ప్రాకారంగా కోట ముగ్గు పోసుకొని అది కొంత పని జరిగి గోడలు లేచిన పిమ్మట లోపల ఇండ్లు ప్రారంభ మయ్యేవి. ఈ కోటలున్న గ్రామాలు కోట, పేట అని రెండు భాగాలుగా ఉండి కోట గ్రామానికి ఏదో ఒక కొనకు ‘కొంత దూరంలో ఉండేది. అట్లా కాక దాన్నే కేంద్రంగా చేసి కున్నపుడూరు గ్రామాలు పేటలు లేదా వీధులు దాని చుట్టు ప్రస్తరింపబడేవి.
ఆనాడు కోటల్లో పనిచేసేవారు రెండురకాలు. కొందరు రాత్రింబవళ్లు పని చేస్తూనే ఉంటారు. వారికి కోటలోనే ఇండ్లుండేవి. మరి కొందరు పాక్షికంగా ఒక పూట మాత్రమే చేసి తను ఇంటికి వెళ్లేవారి ఇండ్లు కోట వెలుపల ఉండేవి. కోటలోపల ఉండే పని వారి వీధిని ‘అందరూని ఖిల్లా’ పని చేసి వెళ్లిపోయేవారుండే భాగాన్ని ‘బహరూనీ ఖిల్లా’ అని ఆనాడు వ్యవహరించేవారు. అయితే ఈ ప్రతాప గిరి కోట అంతా అందరూని ఖిల్లానే గాని బహరూని ఖిల్లా గాదు. ప్రస్తుతం మనం ప్రతాపరుద్రకోట అని పిలిచే గోడ కోటగాదు. అది ప్రతాపగిరి యొక్క ప్రాకారం మాత్రమే. అదంతా పీఠభూమి ప్రదేశం కనుక తమ రాజ్యరక్షణ కోసం ఆనాడు ప్రభువులు కట్టుకున్నారు.
ఈ ప్రాకార ప్రధాన ద్వారం తలపుల కురువ అనే పేర నేడు రోడ్డు ప్రక్కన ఒక శిలాద్వారం నిలిచి ఉంది. ఈ ప్రాకారానికి కోట వెనుక ఒక చిన్న దిడ్డి
ఉంది. దాని నుండి బయటకు వెళ్లినపుడొక సన్నని కాలిబాట తీనెవలె ప్రాకారం వెంట కొంతదూరం సాగి క్రిందకు దిగి తలపుల కురువ దాటి మన్ననూరి బాటకు కలుస్తుంది. అక్కడికి వెళ్లిన పిమ్మట నైజాము సర్కారు కట్టించిన ‘డాగ్ బంగ్లా కుడివైపు నుండి ఒక కాలి బాట ఉమామహేశ్వరం వెళుతుంది. ఆ దారిని వెళ్లితే నేరుగా పాపనాశనం దగ్గర మెట్లు దిగుతాము. అట్లా దిగి పాపనాశనంలో స్నానం చేసి అట్లాగే ఆ దరి వెంట ముందుకు సాగితే ఉమామహేశ్వరుని గుడిని దాటి దాని ప్రక్కగా ఉన్న భ్రమరామ్రం ఎడమవైపు నుండి క్రిందికి దిగే మెట్లున్నవి.
కాకతీయుల కాలంనాడు ప్రతాపగిరి కోటలో ఉన్న సైనికులు ఈ దారిగుండానే క్రిందికి దిగి ఉమామహేశ్వరుని దర్శనం చేసుకొని కొండనుదిగి భోగమహేశ్వరం చూచుకొని అక్కడి నుండి ఈనాటి రంగాపురం దాటి కుంచోని చెలుక మÖల నుండి కొండ యెక్కి మళ్లీ మొదటి దారికి కలిసి కోటలో పడేవారుట.
మొలకమామిడిలో ఉన్నప్పుడు ఏటా ఏకాదశి శివరాత్రులకు పాపనాశనం దారి మీదుగానే ఉమా మహేశ్వరం చేరేవారు. అపుడొక పర్యాయం పాపనాశనం దారివెంట నడిచి భ్రమరామ్రం అవతలి నుండి క్రిందికి దిగినాము. అప్పటికే అక్కడి మెట్లన్నీ బాగా కూలిపోయి ఉన్నవి. మేము ఒకరి కొకరు బిగ్గరగా పట్టుకొని ఎలాగో దిగినాము. అప్పటికి భ్రమరామ్రం క్రింద కాకతీయుల నాటి బండారు రామయ్య చేయించిన తేరు అడుగు చౌకట్టు విరిగిపడి ఉన్నది. పూర్వం శ్రీశైల దేవస్థానం స్థానాధిపతి ఓంకార రాశి పండితుడు ఇక్కడే ఉండేవాడట. ఇపుడు సరిగా గుడిపైన దరికి మట్టిగోడతో ఒక గది, దాని ముందు చిన్న గుండం అక్కడనే గది ముఖ ద్వారానికి కుడివైపున దరికి నృత్య నరసింహమÖర్తి శిల్పం ఒకటి రేఖాచిత్రంగా ఉంది. ఆ ద్వారానికి నరసింహద్వారం అని పేరట. శ్రీశైల స్థానాధిపతి ఆ గదిలోనే ఉండే వాడనేవారు. ఇపుడక్కడ అతనిదొక ‘మునిగల్లు’
ఉంది. మనకు ఈనాడు ఫోటోలెట్లాగో ఆనాటి వారికి వీరగల్లులట్లా ఉండేవి. ఎవరు ఏ రంగంలో కాస్త ప్రసిద్దమైనా వారి పేరుతో వీరగల్లులను నిలుపుతుండేవారు. అయితే ప్రతాపరుద్రకోటలో మాత్రం నాకు వీరగల్లులు నాగశిల్పాలు ఒక్కటిగూడ కనిపించలేదు. ఈ కోటను గురించి ఇంకా లోతైన పరిశోధన చేస్తే మరెన్నో చారిత్రకవిషయాలు వెలుగులోనికి వస్తాయి.