మొత్తం పేజీ వీక్షణలు

25, జూన్ 2026, గురువారం

చక్రతీర్థ మాహాత్మ్యము-ప్రబంధ ధోరణి

చక్రతీర్థ మాహాత్మ్యము-ప్రబంధ ధోరణి

పరిచయం:

శ్రీ కపిలవాయి లింగమÖర్తి గారంటే తెలియని వారెవరూ తెలుగు సాహితీ లోకాన ఉండరు. కవి, పండితుడు, చరిత్ర పరిశోధకుడు, అసంఖ్యాక గ్రంథ నిర్మాణదక్షుడు కపిలవాయి లింగమÖర్తిగారు. వీరు రచించిన “చక్రతీర్థ మాహాత్మ్యము” ఐదు ఆశ్వాసాలుగా, 360 గద్య పద్యాలలో వ్రాసిన చంపూ కావ్యము. ఇది స్థల చారిత్రక కావ్యము, క్షేత్ర మాహాత్మ్య కావ్యము. పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా) లోని పెద్దపల్లిలో గల శ్రీ బుగ్గ వేంకట రమణుని కోవెలలో వెలసిన శివకేశవులకు సంబంధించిన, గ్రామ ప్రజలలో ప్రచారంలో ఉన్న స్థల పురాణ కథలను ఆధారం చేసుకొని రూపుదిద్దుకున్నదే ఈ కావ్యం. స్థల పురాణ కథల నాధారంగా ఆయా క్షేత్రాలలో దేవుడు ఎలా వెలసినాడో, భక్తులకు ఎలా స్వప్నమున దర్శమిచ్చాడో, ఎలాంటి పూజలు, ఉత్సవములు జరుగునో, స్వామివారు ఎలాంటి లీలలను, మహిమలను చూపించారో ఈ క్షేత్రమాహాత్మ్య కావ్యాýలో వర్ణింపబడు చుండును. అద్భుతమైన వర్ణనలతో, చక్కని శబ్దార్థాలంకాలతో, మాండలిక పద ప్రయోగాలతో నిండుగా ఉండి, శ్రీ బుగ్గ వేంకట రమణుని మహిమలను కళాత్మకంగా వర్ణించడం ఈ కావ్యంలో కనిపిస్తుంది. 19.05.1980 రోజున నాగర్ కర్నూల్ లోని శ్రీ సీతారామ స్వామి ఆలయంలో “శ్రీ అవధూత బోధానందేంద్ర సరస్వతీ స్వాముల వారి అధ్యక్షతన జరిగిన బ్రాహ్మణ పరిషన్మహా సభా సమక్షమున బ్రహ్మశ్రీ తెలక పల్లె రామచంద్ర శాస్త్రిగారు ఈ కావ్యమునావిష్కరించారు. మరల నవంబర్ 2019న కపిలవాయి అశోక్ బాబు సంపాదకత్వంలో ఈ కావ్యాన్ని తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించింది.

కాశీఖండము, భీమఖండము, శ్రీకాళహస్తీశ్వరమాహాత్మ్యము, పాండురంగమాహాత్మ్యము వంటి వాటి లాగానే ఈ చక్రతీర్ధ మాహాత్మ్యము ఎలా ప్రబంధ ధోరణిలో సాగిందో వివరించే ప్రయత్నం చేస్తాను.

వర్ణనా కౌశలం

ప్రబంధములకు వన్నె తెచ్చే మరొక ప్రధాన లక్షణం అష్టాదశ వర్ణనలు. ఈ చక్రతీర్ధ మాహాత్మ్యములో కూడా ఈ వర్ణనా సౌందర్యం అడుగడుగునా కన్పిస్తూ ఆద్యంతము రమణీయంగా అభివ్యక్తమవుతుంది.

చారిత్రక పరిశోధన చేయుటలో సుదీర్ఘానుభవము గల శ్రీ కపిలవాయి లింగమÖర్తి గారు గ్రామ ప్రజల నోట విన్న చారిత్రకాంశాలను, స్వామి వారి మహిమలను ఒక అద్భుత వర్ణనాత్మక కావ్యముగా తీర్చిదిద్దినారు. కావ్యమంటేనే కథకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, వర్ణనకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. 

ఈ చక్ర తీర్థ మాహాత్మ్యములో కవి ఉహకు నికషోపలమైన` ప్రారంభమున చేసిన మత్య్సావతార, లక్ష్మీదేవి, సుదర్శన చక్ర, పాంచజన్య, దేవతా వర్ణనలు, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతు వర్ణనలు, పంటపొలాల వర్ణన, 

విష్ణుమÖర్తి వర్ణన, స్త్రీల వర్ణన, జాతర వర్ణన, మధ్యాహ్న, సాయంసంధ్య, వెన్నెల వర్ణనలు కావ్యానికి ప్రత్యేక శోభను తీసుకువస్తాయి. మచ్చునకు`

అవతారికలో సుకవిస్తుతి చేయుచూ

కచభరమెన్న సూరపుడు, కన్నులు పెద్దన, ముక్కు తిమ్మన

త్వచము బెడంగు నయ్యలుడు, పల్కు తెనాలి, గళంబుసంకుసా

ల, చనులు భట్టుమÖర్తి, యవలగ్నము మల్లనయైన, యా ప్రబం

ధ చతుర వాణి నాంధ్రిని ముదంబున సంస్తుతి జేసి యెంతయున్ (చూ.అశోక్ బాబు:31)

 ఎంత చక్కటి ఉహ! సరస్వతీదేవికి శరీరముగా మన కవులు ఎలా ఉన్నారో తెలియజేస్తుందీ పద్యం.

ఈ కావ్యంలో ఋతు వర్ణనలు చాలా అద్భుతంగా, ప్రబంధ కవుల ధోరణిలో ఉండడం మనం చూస్తాం.                    

ఉదాహరణకు` హేమంత ఈ ఋతు వర్ణన`

సింగపట్టణమందు జేరిన నరహరి

ఆదిలక్ష్మిని గూర్చి యాత్రపడియె

గట్టు తుమ్మెనగట్టు మెట్టి రామేశుండు

గౌరికై మనసిజు గాంచి యలిగె

కందూరి యందున గలుగురామస్వామి

యిందిరా దేవికై కందువారె

కారువంగపురాన గలుగు విశ్వేశుండు

అగజాత కోసమై సెగలనందె

తిరుమలాపురిలో కొల్వుదీరినట్టి

స్వామితనదేవి కోసమై సగమునయ్యె

యిన్నిటికి గూడ మొదటిదై యింపెసంగ

వేంకటేశుని కళ్యాణవేళ వచ్చె (చూ.అశోక్ బాబు:92)

చలికాలము ప్రవేశించింది. శివకేశవులు కూడా భార్యలతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారట. అయితే ఇది మహబూబ్ నగర్ స్థానిక దేవాలయాలలోని దేవుళ్ళ ప్రస్తావన తేవడం చారిత్రక స్థలపురాణానికి మరింత ఔచితీమంతంగా ఉంది, సరిగ్గా అదే సమయానికి వేంకటేశ్వరుని కళ్యాణ ఘడియలు వచ్చాయి అనడం సందర్భోచితం.

జాతర వర్ణన అత్యంత సహజంగా కన్నుల ముందు దృశ్యము కనిపించినట్లున్నది.


పాలపండ్లతోడ పందార చిలుకను

గొఱికి తినెడు కొడుకు గుఱ్ఱ కొఱకు

జాతరందుగొనియె సన్నని మొలత్రాడు

కట్టి మరియు నొక్క కన్న తల్లి (చూ.అశోక్ బాబు:97)


చిలుకలు బెండ్లు బత్తీ 

సలు పుట్నాల్  బొంగు లుప్ప్పుచవిగల సేగున్

విలుచక పొట్లా లింతిం

తలుగా గట్టించు కొంచు తరలి రిండ్లకున్ (చూ.అశోక్ బాబు:97)

గ్రామీణ ప్రజలు జాతరలో చేయు పనులు, వారి మాండలిక భాషా పదాలు సందర్భోచితంగా ఉన్నాయి.

వివిధ వృత్తుల వర్ణన: సుమతీ శతకకారుడు అప్పిచ్చువాడు, వైద్యుడు, ఏఱు, ద్విజుడు లేని ఊరిలో ఉండవద్దు అని చెప్పాడు. అలాగే కపిలవాయి లింగమÖర్తి గారు కూడా వివిధ వృత్తులవారు ఎలాంటి సేవలందిస్తారో, వారు లేకుంటే ఆ గ్రామములో అనేక రకాల పనులు ఆగిపోతాయని చెప్పారు. భూదేవతలు, వైద్యులు, కమ్మరి, వడ్ల బత్తుడు, కంచరి, సొన్నారి, సాలెవారలు, దర్జి, చాకివారలు, మంగలులు లేకపోతే నిత్యము ఊరిలో జరిగే కార్యక్రమాలు ఆగిపోతాయని చెప్పారు.(తృతీయ`10, 11 పుట:70)

ప్రబంధ ధోరణిలో సాగిన సాయం సంధ్యా వర్ణన చూస్తే`“కవయ:క్రాంత దర్శన:” అన్నమాట గుర్తుకు రాక మానదు. 

కుంకుమ పంకమల్కి తెఱగొప్ప మరిన్ మహిషాక్షి ధూపముల్

పొంకముతోడ నింపి కరముం జిరుదీపికలుంచె పశ్చిమా 

శాంకణమందనంగ నెఱసంజయు చీకటి చుక్కలున్ ప్రమో

దాంకురమై పయిం బయిని నంతట దోచె నభస్థలంబునన్(ప్రథమ`21, పుట:41)

16వ శతాబ్దమునాటి వర్ణననలకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నదిది. సాయం సంధ్య వేళలో గల ఆకాశము ఎరుపెక్కడం, సూర్యుడు చిరుదీపిక వలె ఉండటం వంటి ఉహ అమోఘం

అలాగే వెన్నెలను వర్ణిస్తూ` “వరిపిండియు, పేలాలుం తఱిపి పాలు సున్నమిలను తలదాచునటుల్ గురిపించె పండు వెన్నెల....” (ప్రథమ`23, పుట:41) అంటారు. పల్లెటూరిలో తఱచూ కన్పించే వాటిని ఉపమానాలుగా వాడటం గమనార్హం.

అలంకారములు:

కావ్య కన్యకు కథ శరీరమైతే, అలంకారములు అలంకారములు. శ్రీ కపిలవాయి లింగమÖర్తి గారు సందర్భోచితంగా వాడిన అలంకారములు కథకు మరింత శోభను కలిగిస్తాయి. ఈ కావ్యంలో శబ్దాలంకారాలతో బాటు ఉత్ప్రేక్ష, స్వభావోక్తి, శ్లేష, రూపక, ఉపమాది అలంకారాలు ప్రయోగించారు.

ఉత్ప్రేక్ష :

ఉత్ప్రేక్ష  అలంకారములో

ఉపమేయము ఉపమానంగా ఉహించబడుతుంది. ఉపమానము లోక ప్రసిద్ధమైనది కాకుండా ఉంటుంది. లేదా కేవల  కవి  కల్పితమై ఉంటుంది.  ఉపమేయ  ఉపమానములకు గల సామ్య  ధర్మము కేవలము కవి కల్పితమై ఉంటుంది.  ఇది వస్తు, ఫలముల నాశ్రయించి ఉంటుంది.(చూ.శ్రీనివాసరావు:170)

         అంత ప్రళయంబు ముగిసిన యవతరింప

గల పునస్‌సృష్టి కాద్యమై వెలసినట్టి

కమ్ర యోంకార నాదపు క్రమమనంగ

కొక్కొ రొకొయని తొలికోడి కూత వేసె (చూ.అశోక్ బాబు:42)

తెల్లవారుఝామున కోడికూయడం సహజం. కాని అది ప్రళయం తర్వాత మరల సృష్టి చేయునపుడు వినిపించే ఓంకార నాదమేమో అన్నట్లుగా తొలికోడి కూత ఉందనడం ఉత్ప్రేక్ష.

ఉపమ: 

ఉపమేయ ఉపమానముల ధర్మసాదృశ్యమును సుందరముగా వర్ణిస్తే అది ఉపమ(చూ.శ్రీనివాసరావు:136)

         వారికి దేవరకొండని

గారంబుల రాజధానిగా నొప్పారెన్

శ్రీరామునకు నయోధ్యా

తీరున దుర్భేద్య మగుచు దిక్తతి నుతమై (చూ.అశోక్ బాబు:86)

శ్రీరామునకు అయోధ్య ఎలా దుర్భేద్యముగా ఉందో సురభి వంశము వారికి రాజధానిగా దేవరకొండ ఉందని చెప్పడం బాగుంది.

రూపకము: 

గుణ సామ్యాన్ని బట్టి ఉపమేయోపమానములకు అభేదము చెప్ప్పుట రూపకము(చూ.శ్రీనివాసరావు:185)

గ్రామములో నిర్మించిన దుర్గము (కోట) నకు, దుర్గాదేవికి అభేదము వర్ణించడం చూస్తే భాగవతంలో పోతనగారు చిన్నికృష్ణునికి శివునికి అభేదం వర్ణించడం స్ఫురిస్తుంది.

తలపైని ముసిరిన బలునీలి మొగుళులు

విరిసివ్రేలెడు పెను వెండ్రుకలుగ

తలలెత్తి జూడంగ వలయు దంచనములు

నాకాశమున కెత్తు హస్తములుగ

బురుజులం బరగెడు పరశుకుంతాదులు

కరముల నాయుధోత్కరము గాగ

జిగురు సారంబులు జిలికి మేదించిన

మినుకులీనెడు గోడ మేనుగాగ

శత్రు సైరిభముల కెల్ల సత్తియనగ

దుర్గమును నిల్చిదొలగ దృగ్దోష సమితి

దుర్గనుత దంతికంబున తోరమైన

భక్తిచేత ప్రతిష్ఠించి ప్రజలు మెచ్చ (అశోక్ బాబు:72,73)

స్వభావోక్తి: 

ఉన్నదున్నట్లుగా కనులకు కట్టినట్లుగా సుందరముగా చేయు వస్తు వర్ణనము స్వభావోక్తి.(శ్రీనివాసరావు: 276) 

పుష్కరిణి త్రవ్వడానికి వచ్చిన ఉప్పరుల రూపము ఎలా ఉందో ఇలా వర్ణించారు కవి.

మొలను చెకుముకి సంచియు ముదుక కాసె

తల రుమాలున చుట్టపీకలను దోపి

భుజమునం గడ్డపారలు బొదలుచుండ 

నుప్పరులగుంపు గదలె నప్పప్ప యనగ (అశోక్ బాబు:60)

పుష్కరిణి త్రవ్వుచుండగా ఆవిర్భవించిన శివుని సహజ సుందర రూపాన్ని వర్ణించడంఅద్భుతంగా ఉంది. “తెల్లని పూతయున్...” (ద్వితీయ`56, పుట:64).

వస్తువు: 

ఈ ‘చక్రతీర్థ మాహాత్మ్యము’ కావ్యమున కథ సంక్షిప్తముగా, దేవేంద్రపురి, ఉపేంద్రపురి, నరేంద్రపురియను సన్యాసులు కలరు. దేవేంద్రపురికి విష్ణువు కలలో కనిపించి తన ఉనికిని తెలుపగా, ఉప్పరులతో త్రవ్వించిన బుగ్గ (నీరు ఉబికి రావడం) శ్రీవేంకటేశ్వరుని విగ్రహం, తెల్ల గుండ్రాయి (శివుడు) కన్పించాయి. తరువాత ఆలయ నిర్మాణం, పుష్కరిణి త్రవ్వడం, గ్రామనిర్మాణము, పుజావిధానములు వర్ణింపబడినాయి.

శివ కేశవాద్వైతము: శ్రీ బుగ్గ వేంకటరమణుని కోవెలలో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామితోబాటు, పుష్కరిణి త్రవ్వుచుండగా తెల్లటి గుండ్రాయి (స్వయంభూ లింగము) వెలువడినది. ఇలా శివకేశవుల ఆవిర్భావము, వారి ఏకత్వము ఈక్రింది పద్యంలో చక్కగా చెప్పబడింది.

శివుడు ఇలా చెప్పాడు`

ఏనెవ్వరొగాదు సుడీ

ఆ నల్లనివాడు నేను నారయ నొకటే

ఏ నతడై యతడేనై

మానుగ నిరురూపులట్లు మసలెదము సుమీ! (ద్వితీయ. 57, పుట:64)

ఛందస్సు:

చంపూ పద్ధతిలో 360 గద్య, పద్యాలతో రచింపబడిన కావ్యమిది. ఆశ్వాసాంతములలో పూర్వ కవులవలెనే ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము, వంశస్థవృత్తము, శాలినీ వంటి విశేష ఛందములే వాడబడినవి. కావ్యనామము సార్ధకమగునట్లు కావ్యాంతమున “చక్రబంధము” రచింపబడినది. ప్రబంధ కవుల రీతిలో “బంధ కవిత్వం” వ్రాయడం శ్రీకపిలవాయి లింగమÖర్తి గారి పాండిత్య ప్రతిభను తెలియజేస్తుంది.

సుత్రామాది నిలింప రక్షక్ష! తతస్ఫూర్తి ప్రభావిభిధా

మిత్రాఖ్యాన్వయరణ్య! భావుక యశస్వీ! కృష్ణమేఘోపమా!

క్షత్రప్రాభవమÖర్తి! నిత్య కమలాఖ్యాతి ప్రసంగాన్వితా!

ధాత్రీరక్షక! కామితార్థ సులభా! తాత్పర్యమానాబుధా!

పూర్వ కవుల ఛాయలు:

ఈ క్రింది పద్యం చూస్తే అచ్చం నన్నయ పద్యములాగానే అనిపిస్తుంది. 

“నుతజలపూరితంబులగు నూతులు నూరిటి కంటె సూనృత వ్రత! యొక బావిమేలు.....”(ద్వితీయ`12, పుట:54)

అలాగే పోతన గారివలె`

“కలయో వైష్ణవ మాయయో....”(ద్వితీయ`66, పుట:66)

ఇలా మనకు పూర్వ కవుల వంటి పద్యాలు అరుదుగా దర్శనమిస్తాయి.

ముగింపు:

క్షేత్రమాహాత్మ్య కావ్యమనదగిన, స్థల పురాణ కథను చక్కటి ప్రబంధ ధోరణిలో రచింపబడిన ఆధునిక కావ్యమిది. ఇటువంటి కావ్యములు నేటి ఆధునిక కవులు సమధికముగా రచించిన తెలుగు సాహితీ లోకానికి మీVAపకారము చేసిన వారలగుదురు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి