తెలుగు సినిమా ఆవిర్భవించి ఇప్పటికి 75 ఏళ్లు పూర్తయ్యింది. ఎందరో
మహానుభావులు ఆవిర్భవించి సినీ పరిశ్రమను సుసంపన్నం చేశారు. ఈ రోజున
సినిమా అనేది ప్రజల జీవనంలో కలిసిపోయిన సమాహార కళారూపం. ఇంతటి
విశిష్టత కలిగిన సినిమాలపై అందులోనూ సినీ సాహిత్యంపై ఈనాడు
విశ్వవిద్యాలయాల్లో విస్తృతంగా పరిశోధనలు జరుగు తున్నాయి. తెలుగు సినిమాలకు
సంబంధించి తొలి కవి చందాల కేశవదాసు, ఆ తర్వాత వచ్చిన సీనియర్ సముద్రాల,
తాపీ, మల్లాది, దేవులపల్లి, కొసరాజు, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, దాశరథి, సి.
నారాయణరెడ్డి, వేటూరి వంటి దిగ్గజాల దగ్గరనుండి నేటి సిరివెన్నెల, సుద్దాల అశోక్
తేజ, చంద్రబోస్ వంటి సినీకవుల వరకు వారి వారి కలాల నుండి జాలువారిన ఎన్నో
రసరమ్య గీతాలు ఉన్నత మైన సాహితీ విలువల్ని గుబాళింప జేశాయి. ఇంతటి
సాహిత్య విలువలున్న సినీ గీతాల సేకరణలో, పరిశోధనలో నేటికీ అకుంఠిత దీక్షతో,
మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న విశిష్ట పరిశోధకుడు భైరవభొట్ల
వేంకట నారాయణ రావు.
ఈయన చేసిన సినీ సాహితీ పరిశోధన సాగారాన్ని మధించే ముందుగా
ఆయన జీవనరేఖల్ని స్థూలంగా పరిశీలించడం సముచితం. కనుక, ఈ అధ్యాయంలో
ఆయన జీవనరేఖల్ని జననం మొదలు సినిమాపాటల పరిశోధకుడిగా మారిన వైనాన్ని
బాల్యం, విద్యాభ్యాసం వంటి వివిధ శీర్షికలతో స్థూలంగా విశ్లేషించడం జరిగింది.
1.1. జననం :
భైరవభొట్ల నారాయణరావు కృష్ణాజిల్లా, గుడివాడ పట్టణంలో 16.06.
1945 వ సంవత్సరంలో జన్మించాడు. భైరవభొట్ల చంద్ర శేఖరరావు, మహాలక్ష్మమ్మ
యితని తల్లిదండ్రులు. ఈయనకు ఇద్దరు తమ్ముళ్లు, నలుగురు చెల్లెళ్లు వున్నారు.
ఈయన పూర్తి పేరు భైరవభొట్ల వేంకట నారాయణరావు. కానీ సినీ ప్రముఖులు, తెలుగు
సినీ పరిశోధకుల మనసుల్లో మాత్రం ‘భైరవభొట్ల’ గానే ఈయన లబ్ధ ప్రతిష్ఠుడు.
1.2. బాల్యం - విద్యాభ్యాసం :
భైరవభొట్ల బాల్యం నుంచి తనను ఎవరైతే మనస్ఫూర్తిగా అభిమానించి
స్నేహం చేస్తారో, అలాంటి వారి కోసం అన్వేషించేవాడు. ఆ అన్వేషణలో ఒక భాగంగా
బాల్యంలో తమ ఇంటికి ఎదురుగా ఉన్న అన్సారి గారి కుమారుడైన బాషా తో (షిప్
యార్డు, విశాఖ పట్టణం) స్నేహం కుదిరింది.
భైరవభొట్ల నారాయణరావు 1955 వ సంవత్సరంలో గుడివాడ లోని
మునిసిపల్ ఎలిమెంటరీ స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. 1960 వ
సంవత్సరంలో శ్రీ పొట్టి శ్రీరాములు మునిసిపల్ కళాశాలలో హైస్కూలు విద్యను, 1962
వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. 1965 వ సంవత్సరంలో
అక్కినేని నాగేశ్వర రావు కళాశాలలో గ్రాడ్యుయేషన్ విద్యనభ్యసించి, చెన్నైలోని
‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ విశ్వవిద్యాలయంలో 1967 వ సంవత్సరంలో
ఎం.ఏ. హిందీ పూర్తి చేశాడు.
భైరవభొట్ల ఏడో తరగతి చదివేంత వరకు హిందీ భాషలో అక్షరాలు
కూడా తెలీవు. ఒకరోజు తరగతిగదిలో హిందీ మాస్టారు వచ్చి హిందీ అక్షరాలు రాని
వారిని నిలబెట్టి మందలించాడు. వాళ్లలో భైరవభొట్ల కూడా వున్నాడు. హిందీ
అక్షరాలు నేర్చు కున్న తర్వాతే మళ్లీ క్లాసుకు రమ్మన్నాడు మాష్టారు. తరగతి గదిలో
జరిగిన అవమానాన్ని భైరవభొట్ల సహించకపోయాడు. క్లాసుకి వెళ్లాలంటే హిందీ
అక్షరాలు నేర్చుకోవాలి. హిందీ నేర్చుకోవడానికి ఒక మాష్టారు దగ్గర ట్యూషను
పెట్టించమని భైరవభొట్ల తన తండ్రిని అడిగాడు. ఆయన గుడివాడలో ఒక హిందీ
ప్రైవేటు మాష్టారుని, పెదపారుపుడి గ్రామంలోని ఒక హిందీ పంతులమ్మను ప్రైవేటు
చెప్పడానికి మాట్లాడాడు. భైరవభొట్ల రెండు, మÖడు నెలల్లోనే హిందీ అక్షరాలు,
గుణింతాలు మొదలైనవన్నీ నేర్చేశాడు. ఆతర్వాతనే క్లాసుకు వెళ్లాడు. ఆయన హిందీ
క్లాసుకు వెళ్లడమే గాకుండా 1957 లో హిందీ ప్రాథమిక పరీక్ష కూడా ప్యాసయ్యాడు. ఆ
ప్రాథమిక సర్టిఫికేటును డా. అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా పొందాడు.
ఆ తర్వాత చలమయ్య అనే హిందీ మాష్టారు దగ్గర చదువుకొని
భైరవభొట్ల ‘రాష్ట్రభాషా’, ‘ప్రవేశిక’ అనే రెండు హిందీ పరీక్షలు ప్యాసయ్యాడు.
1.3. ఉద్యోగ జీవితం - వివాహం :
భైరవభొట్ల గుడివాడకు దగ్గరలో ఉన్న ‘బొమ్మలూరు’ అనే
గ్రామంలోను, పాత గుడివాడలోని బంటుమిల్లి రోడ్డుకు దగ్గరగా వర్తకుల వీధిలోను
హిందీ పరీక్షలకు ప్రైవేటుగా ట్యూషన్లు చెప్పేవాడు. ఇలా భైరవభొట్ల ప్రైవేట్లు
చెప్పడం కంటే, ఎక్కడైనా ఒకే పాఠశాలలో హిందీ మాష్టారుగా ఉద్యోగం చేస్తే
బాగుంటుందని అభిప్రాయపడి, ఆ విషయాన్ని తన మిత్రుడు కొచ్చెర్ల సుబ్బారావుకు
చెప్పాడు. సుబ్బారావు తన మిత్రుడైన పొట్లూరి వేంకటేశ్వరరావుకు ఈ విషయం
చెబితే ఆయన భైరవ బొట్లకు గుడివాడ సమీపంలోని జమీ గొల్వేపల్లెలో విశ్వకవి
విద్యానికేతన్ లో హిందీ మాష్టారుగా ప్రవేశ పెట్టాడు. అక్కడ 6 నెలలు ఉద్యోగం చేసిన
తర్వాత భైరవభొట్ల జీవనశైలిని యాజమాన్యం వ్యతిరేకించింది. కానీ తన వ్యవహార
శైలిని మార్చుకోని భైరవభొట్ల ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు.
ఆ తర్వాత పామర్రు సమీపంలోని విద్యావనం అనే హిందీ కళాశాలలో
హిందీ పండిట్ ట్రైనింగ్ లో చేరాడు. 1976 లో విజయవాడ, జ్యోతి కళాశాలలో
కాండూరి రామమోహన రావు అనే వ్యక్తి ఆదరణ వల్ల పార్ట్ టైం లెక్చరర్ ఉద్యోగం
దొరికింది. ఆ తర్వాత అప్పలస్వామి కాలేజ్ లో మరో పార్ట్ టైం లెక్చరర్గా భైరవభొట్ల
ఉద్యోగం చేశాడు. 1977 లో విజయవాడ జ్యోతి కళాశాలలో చేరిన భైరవభొట్ల పూర్తి
స్థాయి లెక్చరర్ గా 2002 లో పదవీ విరమణ పొందాడు.
భైరవభొట్ల కేవలం పాఠాలు చెప్పడమే గాకుండా పిల్లల్లోని
సృజనాత్మకతను వెలికితీసి, వారి ప్రతిభకు తగిన గుర్తింపు నందించాలని తపన
పడ్డాడు. 1981 లో తమ కళాశాలలోని హిందీ విద్యార్థుల చేత హిందీ కవితలు
రాయించి వాటిని బైండు చేసి, విజయవాడలో ఉన్న అందరు హిందీ
ఉపన్యాసకులను ఆహ్వానించి ‘హిందీ బాలకవి సమ్మేళనం’ ఏర్పాటు చేసి హిందీ
బాల కవులు రచించిన ‘అక్షర హిందీ కవితా సంపుటి’ ఆవిష్కరింపజేశాడు.
ఎక్కడో విశ్వవిద్యాలయాల్లో చేయాల్సిన పనిని ఒక ప్రైవేటు జూనియర్
కాలేజిలో వుంటూ చేశారని వచ్చిన అతిథులంతా ప్రశంసించారు. ఇది తెలుసుకున్న
విజయవాడలోని అగ్రవాల్ సమితి వారు, రాజస్థాన్ సమితి వారు తమ తమ సంస్థలు
నిర్వహించే హిందీ కవి సమ్మేళనాల్లో భైరవభొట్లని స్వీయకవితా గానం చెయ్యడానికి
హిందీ కవిగా ఆహ్వానించేవారు. ఇంకా ప్రభుత్వ కళాశాల, హిందీ ట్రైనింగ్ కళాశాల,
ఆకాశవాణి వారు నిర్వహించిన హిందీ కవి సమ్మేళనాల్లో కూడా భైరవ భొట్ల
పాల్గొన్నాడు.
భైరవభొట్ల 15.12.1977 లో విజయవాడ మాంటిస్సోరి ఉన్నత
పాఠశాలలో తెలుగు పండిట్ గా పని చేస్తున్న రాచకొండ వేదాయిని ని వివాహం
చేసుకున్నాడు. వీరికి ఒక్కడే కొడుకు, రాఘవేంద్ర.
1.4. సినిమా పాటలపై అభిరుచి :
భైరవ భొట్లకు బాల్యం నుండీ పాటలంటే చాలా ప్రీతి. పాటలు ఎక్కడ
వినబడినా వాటిని ఆసక్తిగా వినటం ఆయనకు అలవాటు. భైరవభొట్ల, తన మేనత్త
సంగీత పాఠాలు నేర్చుకుంటూ ఉంటే తాను చాలా ఆసక్తిగా ఆలకించేవాడు. సంగీతం
మాష్టారు త్యాగరాజకృతులు, అన్నమాచార్య సంకీర్తనలు, సినిమా పాటలు
హార్మోనియం మీద నేర్పుతుంటే శ్రద్ధగా వినేవాడు. బాల్యంలో పాటలు వినాలంటే
గ్రామఫోను రికార్డు ఒక్కటే ఆధారం. అందువల్ల తెల్లవారు జూమునే ీVAటళ్ల దగ్గరికెళ్లి
సినిమా పాటలు వినేవాడు. గంటల తరబడి వీధుల్లో నిలబడి ఆ పాటల్ని విని
పరవశించి పోయేవాడు. బాల్యంలో భైరవభొట్ల మనసు దోచిన సినీ గీతాల్లో కొన్ని `
1. ‘అదిగదిగో గగన సీమ అందమైన చందమామ ఆడెనోయి’ (నా యిల్లు - 1953)
2. ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమైనా తీరునో రన్నా చిన్నన్నా’
(రోజులు మారాయి - 1955)
3. ‘మాయా సంసారం తమ్ముడు నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడూ’
(ఉమాసుందరి -1956)
4. ‘రావెరాధారాణీ నీవే రాధ నీవే కృష్ణుడనేనే’ (శాంతినివాసం -1960)
మొదలైనవి. భైరవభొట్ల గుడివాడలోని శరత్ సినిమాహాలు పక్కనే వున్న
గోకుల్ మహల్ అనే కాఫీ ీVAటల్ దగ్గర సినిమా పాటలను వినేవాడు. పాటలు వినగా
వినగా వాటి పాటల పుస్తకాలు ఎక్కడ ఉంటాయో తెలుసుకొనే ప్రయత్నం చేశాడు.
ఇంట్లో వాళ్లు చేతి ఖర్చులకు ఇచ్చిన డబ్బులను దాచిపెట్టుకుని పాటల పుస్తకాలను
కొనేవాడు.
ఈపాటల పుస్తకాలను కొనటానికి సినిమాథియేటర్లు లో ఉన్న కాంటీనుల
చుట్టూ తిరుగుతుండే వారు. పాటల పుస్తకాలను కొన్న తరువాత వాటి పాటలను చదివి
మళ్లీ మరుసటి రోజు ‘గోకుల్ మహల’ దగ్గరి కెళ్లి పాటలు వింటూనే వుండేవాడు.
“తెనాలి రామకృష్ణ” (1956) చిత్రంలోని పద్యాల్ని విన్న తర్వాత పాటల
పుస్తకంలోని పద్యాల్ని చదవడం, వాటిని చదివిన తర్వాత గ్రామఫోను రికార్డులలో
పాటల్ని వినడం, ఒక అలవాటుగా మారింది. థియేటర్లలోని కాంటీన్ లోని పాటలు
పుస్తకాలే కాకుండా పుట్ పాత్ మీద దొరికే పాటల పుస్తకాలను కూడా భైరవభొట్ల
కొనేవాడు. ఇది ఇతనికి ఒక దినచర్యగా అలవాటు అయిపోయింది.
1.5. ఆత్రేయతో అనుబంధం :
భైరవభొట్ల తన ప్రాణ స్నేహితుడైన గారసత్యనారాయణ మÖర్తి.
మద్రాసులో ఎం.ఏ. లో చేరగానే తనకు గది అద్దెకు దొరికేదాకా ఒక నెల రోజుల పాటు
తన ఇంట్లోనే భైరవభొట్లకు ఆశ్రయం కల్పించి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి
తనకు తెలిసిన సినీ ప్రముఖులందరినీ పరిచయం చేస్తూ ఆయన భైరవ భొట్లను
ఉత్సాహపరి చేవాడు. భైరవభొట్ల ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటలకే ఎం.ఏ.
తరగతులకు హాజరై సాయంత్రం ఐదు గంటల దాకా హిందీ ప్రచార సభలోని
విశ్వవిద్యాలయ విభాగంలో, గ్రంథాలయంలో ఉండి, సాయంకాలం గార
సత్యనారాయణ మÖర్తి ఇంటికి వచ్చేసేవాడు. ఇలా నెలరోజులు గడిచిన తర్వాత
మÖర్తి సంకల్పించి, ఆయన నివాసానికి అతి దగ్గరగా నెలకు యాభై రూపాయలు
చొప్పున ఒక గదిని అద్దెకు ఇప్పించాడు. భైరవభొట్ల తన చదువుకు సంబంధించిన
పుస్తకాలు, సినీ పరిశోధన సామాగ్రి అంతటినీ కలిపి 3 బస్తాలతో అద్దెకు దిగాడు. ఇలా
భైరవభొట్ల ఎం. ఏ. మొదటి సంవత్సరం కొనసాగుతూ ఉన్న, ఆయన మనసులో ఏదో
వెలితి, అసంతృప్తి ఉండేవి. మద్రాసులో ఏ సినిమా రచయిత దగ్గరైనా సహాయకునిగా
పనిచేయాలనే లక్ష్యంతోనే భైరవభొట్ల అక్కడకు వచ్చాడు. కానీ మద్రాసు వచ్చి
నాలుగు నెలలు గడచి పోయినా ఏ రచయిత దగ్గర సహాయకునిగా చేరలేకపోయాననే
బాధ ఆయన్ను తొలిచివేసేది. భైరవభొట్ల తన మనోవేదనను ప్రతిరోజూ గార
సత్యనారాయణమÖర్తి దగ్గర వెలిబుచ్చుతూ ఉండేవాడు. రోజులూ ఇలా గడుస్తూ
ఉండగా సత్యనారాయణ మÖర్తి ఒక రోజు భైరవభొట్లను వెంటబెట్టుకుని మద్రాసు
మైలాపూరులో ఉంటున్న దాశరథి దగ్గరకు తీసుకెళ్లాడు.
భైరవభొట్ల తనకున్న సినీ పరిజ్ఞానాన్ని దాశరథి ముందు
ప్రదర్శించాడు. ఆయన భైరవభొట్లను 10 రోజుల పాటు ఆగి, తర్వాత కలవమన్నాడు.
కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా దాశరథి దర్శనం భైరవభొట్లకు మళ్లీ లభించలేదు.
జూనియర్ సముద్రాల దగ్గర కూడా భైరవభొట్ల ఇలాంటి చేదు అనుభవాన్నే చవి
చూశాడు. దాంతో అతనిలో బాధ మరింత ఎక్కువై పోయింది. ఆ సమయంలో హిందీ
ప్రచార సభ విశ్వవిద్యాలయ విభాగంలో ఆఫీసు మేనేజరుగా పని చేస్తున్న టి.
రామచంద్రన్, మాటల సందర్భంలో భైరవభొట్ల ఆశయాన్ని తెలుసుకున్నాడు.
ఆత్రేయ తనకు బాల్యస్నేహితుడు కావడం వల్ల టి. రామచంద్రన్ భైరవ భొట్లను
ఆత్రేయ దగ్గరకు తీసుకువెళ్లి, ఆయనకు ఈయనను పరిచయం చేసి, భైరవభొట్ల
జీవిత లక్ష్యాన్ని వివరించాడు. ఐతే ఆత్రేయ భైరవభొట్లను ముందుగా తన పెద్ద
కూతురు (స్వర్ణలత, క్రికెట్ క్రీడాకారుడు జ్యోతి ప్రసాద్ భార్య) కు హిందీ ట్యూషను
చెప్పమని అడిగాడు. కానీ భైరవ భొట్లకు అది ఇష్టం లేదు. ఎందుకంటే తన ఆశయం,
లక్ష్యం వేరు. ఇక్కడ జరుగుతున్నది పేరు. ఇదే అభిప్రాయాన్ని భైరవభొట్ల ఆత్రేయ
వద్ద వ్యక్తం చేశాడు. “అయితే వెళ్లిరండి” అని ఆత్రేయ నిర్మొహమాటంగా
చెప్పేశాడు. ఆ తర్వాత ఆత్రేయదగ్గర సంభాషణ సహాయకుడుగా పని చేస్తున్న శ్రీపతి
దత్తాత్రేయ శర్మతో భైరవభొట్లకు పరిచయం కలిగింది . ఆయన భైరవభొట్ల నుంచి
విషయాన్ని తెలుసుకుని మందలించాడు. ఆత్రేయ గారి అమ్మాయికి ట్యూషను
చెప్పకపోతే ఆయన దగ్గర సహాయకునిగా చేరడమసంభవమని తేల్చి చెప్పేశాడు.
దాంతో భైరవభొట్ల, ఆత్రేయ కూతురికి హిందీ ట్యూషను చెప్పడానికి
సిద్ధపడ్డాడు. యాభై రూపాయలు నెలకు జీతం మీద నాలుగు నెలలు భైరవభొట్ల
ట్యూషను చెప్పాడు. ట్యూషను చెప్పడం పూర్తి కాగానే, ఆత్రేయ తనను సినిమా
పాటలు రాసేటప్పుడో, మÖ్యజిక్ సిట్టింగ్ అప్పుడో పిలుస్తాడని భైరవభొట్ల కలలు
కన్నాడు. కానీ ఏనాడూ ఆత్రేయ, భైరవభొట్ల వంకకు కూడా చూడలేదు. ఈ సంఘటన
భైరవభొట్లను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది.
ఇలా ఉండగా ఆత్రేయ ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగి భైరవభొట్లను
ప్రముఖ దర్శక నిర్మాత పి. పుల్లయ్య దగ్గరకు పంపాడు. అప్పుడాయన “ఆయే దిన్
బహార్ కే” అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఆ చిత్రం కోసం సౌండ్ ట్రాక్ ద్వారా
(హిందీ సినిమా స్క్రిప్టులేని) సంభాషణను వింటూ తెలుగులో డిక్టేషన్ చేస్తున్నాడు.
పుల్లయ్య దగ్గర పనిచేస్తున్న పుల్లారావు అనే సహాయదర్శకుడు రాస్తుండేవాడు.
భైరవభొట్ల కూడా ఆపనే చేశాడు. ఇలా భైరవభొట్ల అనువాదం చేసిన తెలుగు
సంభాషణలను ఆత్రేయ చూసి చాలా ఆనందపడ్డాడు. అంతేకాదు ఆయనకు
భైరవభొట్లపై గురికుదిరి తన దగ్గర ఉండమన్నాడు. ఆ హిందీ సినిమాను
‘కొడుకు-కోడలు’ అనే పేరుతో తెలుగులో రూపొందిస్తున్నారని, ఆ చిత్రానికి తానే
మాటలు, పాటలు రాస్తున్నానని చెప్పాడు. దాంతో భైరవ భొట్ల ఆత్రేయ దగ్గరే
ఉండిపోయాడు. ఆ చిత్రం తాలూకు దృశ్యాలకు సంబంధించిన సంభాషణలను
ఆత్రేయ డిక్టేషన్ చేస్తుంటే భైరవభొట్ల రాస్తుండేవాడు. అలా ఆత్రేయ చెబుతుంటే
తెల్లవారు జామున 4 గంటల దాకా సంభాషణలు రాసిన రోజులెన్నో వున్నాయి
భైరవభొట్ల జీవితంలో. తర్వాత “దేశోద్ధారకుడు” తదితర చిత్రాలకు భైరవభొట్ల
ఆత్రేయ వద్ద పనిచేశాడు. వీరిద్దరి గురు శిష్యత్వం 1972 వరకు సాగింది. ఈ మధ్య
కాలంలో సినీరంగంలో నిలదొక్కు కోవడంలో ఉన్న కష్టాల్ని గ్రహించిన భైరవభొట్ల ఆ
ప్రయత్నాలు మానుకుని 1976 లో స్వస్థలం గుడివాడ వచ్చేశాడు.
మళ్లీ 1984 లో ‘శంకరాభరణం” చిత్రాన్ని హిందీలోకి అనువాదం
చేసే సమయంలో మళ్లీ ఆత్రేయతో కలసి 1989 సం. లో ఆయన మరణించే దాకా
భైరవభొట్ల అనుబంధం కొనసాగింది. అదే సమయంలో ‘త్రిమÖర్తి’ అనే చిత్రాన్ని
తెలుగులో “అందరూ బాగుండాలి” (1976) అనే పేరుతో భైరవభొట్ల
అనువదించాడు.
1986లో ఆత్రేయ, భైరవభొట్లను విజయవాడలో కలుసుకుని ఆయన
సినీ పరిశోధనను ఎంతగానో ప్రశంసించాడు. 1988 లో ఆత్రేయ తన పాటల వివరాలు
తెలియజేసే ఒక లఘుసినీగేయకోశాన్ని రూపొందించాల్సిందిగా భైరవభొట్లకు ఉత్తరం
రాశాడు. 1989 లో ఏప్రియల్ మాసంలో ఆత్రేయ, తన పాటల సంకలనం గురించి
మరో లేఖ రాశాడు. అదే ఆత్రేయ, భైరవభొట్లకు రాసిన ఆఖరి ఉత్తరం. అన్నం పెట్టి
ఆదరించిన ఆత్రేయకు, ఆయన రాసిన సినిమాపాటల సంపుటిని అక్షర నైవేద్యంగా
భైరవభొట్ల సమర్పించాడు.
1. 6 . సినిమా పాటల పరిశోధకుడిగా మారిన తీరు :
భైరవభొట్ల ‘శంకరాభరణం’ హిందీలోకి అనువదించిన తర్వాత, మళ్లీ
సినిమాలపై ఆయనకు ఆసక్తి కలిగింది. మహాకవి శ్రీశ్రీ సినీ గేయ సంకలనం
రూపొందించడంలో భాగంగా చలసాని ప్రసాద్, కృష్ణాబాయిలు 1987 సంవత్సరంలో
భైరవభొట్లను కలుసుకున్నాడు. వారి కోరిక మేరకు శ్రీశ్రీ సినీ గేయ సంపుటిని భైరవభొట్ల
రూపొందించాడు. ఈ సందర్భంగా 16.12.1987 న ఆంధ్రప్రభ దినపత్రిక లో
భైరవభొట్ల గురించి ‘పాటకోటి రాస్తున్నాను’ అనే పరిచయ వ్యాసం ప్రచురితమైంది.
దాంతో భైరవభొట్ల సినీ సాహితీ పరిశోధన బాగా వెలుగులోకి వచ్చింది. ఆయనకు
దేశం నలుమÖలల నుండీ ఎన్నో లేఖలు, అభినందలు వచ్చాయి. వీటితో
భైరవభొట్లలో కొత్త ఉత్సాహం వచ్చింది. భైరవభొట్ల, అనంతమైన తన సినీ పరిశోధనా
సామాగ్రిని, కృషిని పదిమందికి అందించాలని, ముఖ్యంగా పరిశోధకులకు ఆ సంపద
ఉపయోగపడాలని 18.12.1988 న “చలనచిత్ర పరిశోధన కేంద్రం” ను ప్రముఖ
పాత్రికేయులు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు అధ్యక్షతన, కేంద్రమంత్రి టి.
సుబ్బరామి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేశాడు.
1. 7. భైరవభొట్ల రచనలు :
భైరవభొట్ల మొట్ట మొదట ‘ధన్యజీవి’ అనే గేయాన్ని రచించాడు.
అది ‘పంచాయితీ రాజ’ (01-11. 1963) అనే మాస పత్రికలో
అచ్చయ్యింది. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు కళాశాల మాగజైన్స్ లలో 1964,
1965, 1966 సంవత్సరాల్లో ‘బంగారు పాప’ ‘ఆశాకిరణం’, ‘భారతవీరా
రావేలా’ అనే గేయాలను రచించాడు. 1969 సంవత్సరంలో విజయవాడ,
అమరవాణి నికేతన్ లో నిర్వహించిన గేయ రచన పోటీల్లో ఈయన రచించిన ‘వీర
ప్రబోధము’ అనే గేయానికిగాను మొదటి బహుమతి లభించింది.
భైరవభొట్ల తెలుగులోనే కాకుండా హిందీ లో కూడా కళాశాల
మాగజైన్సులో 1964, 1965, 1966 సంవత్సరాల్లో పావనా గంగ’, ‘హమారే
ప్రిన్సిపాల్ త్యాగరాజ’, ‘వితరాగ’, ‘కామిని’, ‘బుద్ధదేవ్ ‘ అనే హిందీ
కవితలు రచించాడు. 1965, జనవరి సంచికలో ఏ.ఎన్.ఆర్. కళాశాల పత్రికలో
‘Lశీఙవ Aఅd Lust్ణ అనే ఇంగ్లీషు కవితను కూడా రచించాడు. ఈయన
రచించిన హిందీ కవితలు విజయవాడ ఆకాశ వాణి కేంద్రం ద్వారా 1974-1994 మధ్య
కాలంలో ప్రసారమయ్యాయి. వీటిలో ‘అనాహూత’అతిథి’, ‘సలామ్ కే
గులాయ’, ‘మతలబ్ కేరిస్తే’ మొదలగు కవితలు ఈయనకు బాగా పేరు
తెచ్చాయి. 1988 వ సం. లో ప్రారంభమైన భైరవభొట్ల రేడియో వ్యాసంగం
అప్రతిహతంగా సాగింది. ఈయన ఎన్నో కవి సమ్మేళనాల్లో పాల్గొన్నాడు.
భైరవభొట్ల ఇప్పటివరకు ఎన్నో పరిశోధనాత్మక సంకలవాలను
రూపొందించి, ముద్రించాడు.
1. మంగళ హారతులు (సినిమా పాటలు, 1988). దీన్ని బాలాజి బుక్ డిపో (విజయవాడ)
వారు ముద్రించారు.
2. పద్మశ్రీ ఘంటసాల సుమధుర గానసభ (1989). దీనిని బాలాజీ బుక్ డిపో పబ్లిషర్స్
(విజయవాడ) వారు ముద్రించారు.
3.” తెలుగు సినిమాలలో భక్తి పారవశ్య గీతాలు ‘ (2004),
4. తెలుగు సినిమాలలో భక్తి రసాత్మక గీతాలు
5. ‘తెలుగు సినిమాలలో శృంగార (శాస్త్రీయ) నృత్యగీతాలు (2004)
6. జిక్కి, ఏ. ఎం. రాజా తెలుగు సినీ విభావరీ గీతాలు (2004)
7. తెలుగు సినిమా దేశభక్తి గీతాలు. వీటన్నిటినీ జె.పి. పబ్లికేషన్సు, విజయవాడ వారు
ముద్రించారు.
8. పద్మశ్రీ ఘంటసాల సుమధుర గేయాలు
9. ఘంటసాల మధుర గేయాలు అనే రెండు పుస్తకాలను గొల్లపూడి వీరాస్వామి అండ్
సన్స్ (రాజమండ్రి) వారు 2000 సంవత్సరంలో ముద్రించారు.
ఇంకా భైరవభొట్ల రూపొందించిన అముద్రిత సినీ గేయ కోశాలు, సినీ
పాటల సంకలనాలు చాలా వున్నాయి.
ఉదాహరణకు
1. శ్రీశ్రీ సినీ గేయకోళాలు (డబ్బింగ్) - 3 బైండ్లు
2. కొసరాజు సినీ గేయకోశాలు - 3 బైండ్లు
3. సి.నా.రె సినీ గేయ కోశాలు ` 6 బైండ్లు
4. ఆరుద్ర సినీ గేయ కోశాలు - 3 బైండ్లు
5. ఆరుద్ర సినీ గేయ కోశాలు (డబ్బింగ్) - 3 బైండ్లు
6. వేటూరి సినిమా పాటలు ` 2 బైండ్లు
7. సిరివెన్నెల సినిమా పాటలు ` 6 బైండ్లు
8. దేవులపల్లి కృష్ణశాస్త్రి సినిమా పాటలు ` 2 బైండ్లు
9. తెలుగు సినీ వినీలాకాశంలో వంద చందమామలు
10. తెలుగు సినిమాలలో వానపాటలు
11. దాశరథి సినీ గేయ కోశం.. ఇలా అనేక కోణాల్లో తెలుగు సినిమా పాటల్ని భైరవ
భొట్ల సంకలనాలుగా తెచ్చే ప్రయత్నంలో
భైరవభొట్ల ఉన్నాడు.
1. 8. బిరుదులు - సన్మానాలు :
1. 21.10.1993 వ సంవత్సరంలో ప్రముఖ సినీ పాత్రికేయుడు ఎ. బాల రెడ్డి భైరవ
బొట్లను ప్రశంసిస్తూ “పరిశోధకులకు దిక్సుచి” లాంటి వాడని అక్షరాభినందన
చేశాడు.
2. 02. 12.1997 వ సంవత్సరంలో ప్రముఖ సినీకవి డా. వేటూరి చలనచిత్ర పరిశోధనా
కేంద్రాన్ని దర్శించి భైరవబొట్లకు ‘అక్ష
ర పూజారి’ అనే బిరుదు నిచ్చి సత్కరించాడు.
3. 10.02.1999 వ సంవత్సరంలో ప్రముఖ సినీ సంభాషణల రచయిత డా. పరుచూరి
గోపాల కృష్ణ చలన చిత్ర పరిశోధనా కేంద్రాన్ని
సందర్శించి, భైరవ భొట్ల చేసిన సృజనాత్మక, ప్రయోగాత్మక పరిశోధనలకు ముగ్ధుడై
ఆయనను “ద్రోణాచార్యుడు”అనే బిరుదునిచ్చి సత్కరించాడు.
4. జ్ఞాన పీఠ-అవార్డు గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి “నిరంతర చలనచిత్ర గీత
పరిశోధకులు” అనే బిరుదుతో అభినందించాడు.
1.8.1. సన్మానాలు :
1. 1990 వ సంవత్సరంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్(కాకినాడ) వారు
తెలుగు సినిమా పాటకు ప్రింట్, సౌండ్ అండ్ విజన్ కోఆర్డినేషన్ అనే పరిశోధనా
ప్రక్రియకు భైరవభొట్ల నారాయణరావును సన్మానించారు.
2.1994వ సంవత్సరంలో విశాఖపట్టణంలో భైరవభొట్ల రూపొందించిన ఏ.ఎన్.ఆర్ తో
50 మంది నటీమణులు” అనే వీడియో క్యాసెట్టు ఆవిష్కరణ సందర్భంగా అక్కినేని
భైరవభొట్లను సన్మానించాడు.
3. 1994 వ సంవత్సరంలో నరసారావు పేటలోని రోటరీ, లయన్స్ క్లబ్బులు రెండూ
సంయుక్తంగా భైరవభొట్లను సన్మానించాయి.
4. 1996 వ సంవత్సరంలో మద్రాసు తెలుగు అకాడమీ వారు ఉగాది పురస్కారాన్ని
అప్పటి కేంద్ర సమాచార శాఖామంత్రి పి.ఓ. సంగ్మా చేతుల మీదుగా భైరవభొట్లకు
అందజేశారు.
5. 1999 వ సంవత్సరంలో హైదరాబాదులో డా. సినారె భైరవభొట్లను ఘనంగా
సన్మానించాడు.
6. తెలుగుసినిమా వద్రోత్సవాల సందర్భంగా 2007 వ సంవత్సరంలో తెలుగు
చలనచిత్ర పరిశ్రమ భైరవభొట్లను ఘనంగా సత్కరించిం
ది. ఆ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక అభినందన పత్రాన్ని కూడా
ఆయనకు అందజేసింది. ఆ ఉత్సవాల్లోనే భైరవభొట్ల తన జీవిత కాలంలో సేకరించిన
తెలుగు సినిమా పాటల పుస్తకాలను, వెండితెర నవలలను, చలన చిత్ర పత్రికలను,
తన చలనచిత్ర పరిశోధనా కేంద్రం రూపొందించిన ఆడియో, వీడియో క్యాసెట్లను
ఐదురోజుల పాటు ప్రదర్శించాడు.
ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన అపురూప సినీ సాహిత్య పరిశోధకుడు
భైరవభొట్ల. తన పరిశోధనలో ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు
ఎదురైనా మొక్కవోని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఈనాటికీ ముందుకు దూసుకు
వెళుతున్న దేశాల, అవిశ్రాంత పరిశోధక యోధుడు భైరవ బొట్ల అని చెప్పడంలో
అతిశయోక్తి లేదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి