"రాళ్ళు దేవత లగుదురా గుళ్ళలోన
అవని నాగమశాస్త్రమ్ము ననుసరించి
మించి రాళ్ళను శిల్పీకరించినపుడు
మహిత విగ్రహమ్ము లగును,మంత్ర పూత
ముగ ప్రతిష్ఠించినప్పుడు మోదమొసగు
దేవతార్చన కర్హమ్ములౌ వసుధను..
భారతీయు లీ విధముగా పలుకరాదు.
"రాళ్ళు దేవత లగుదురా గుళ్ళలోన "
రాళ్ళు వీధులలో పడివుంటాయి. ఆగమశాస్త్రా న్ననుసరించి శిల్పంగా మలచినపుడు "రాళ్ళు" అని వాటిని పిలువరాదు . "దేవతావిగ్రహాలు" నాలి. (బంగారంగా వుంటే బంగార మంటాము ఉంగరంగా తయారు చేసినప్పుడు ఉంగరం అంటాము కదా! ఇక బంగారం అనవలసిన పనిలేదు. అట్లే ఇంకా ఎన్నో ఆభరణాలు) మంత్ర పురస్సరంగా ప్రతిష్ఠింపబడినప్పుడు ఆ విగ్రహాలు దేవతార్చనకు యోగ్యము లౌతాయి.
"గుడిలో రాయి వుంది" అని ఎవరూ అనరు. అనడమే తప్పు. "విగ్రహం వుంది" అనాలి. లేదా ఆ విగ్రహం ఏ దేవునికి ప్రతీకయో ఆ దేవు డున్నాడు.. అనాలి. ఉదాహరణకు "రామాలయంలో రాముని విగ్రహం వుంది." అనైనా అనాలి. లేదా "రాము డున్నాడు.." అనైనా అనాలి. అంతే గాని "గుడిలో రాయి వుంది.." అనే మాటయే పొసగదు.
వీధిలో పడివున్న దానిని విగ్రహం అనము కదా! విగ్రహాలను ఆ యా దేవతకు ప్రతీకలుగా భావించి ఆరాధిస్తే ఆ యా దేవతలు ప్రసన్నులై కోరిన కోరికలు తీరుస్తారు. కోట్లాదిమంది కిది అనుభవమే!
ఇదంతా నిరాధారమైనది కాదు. శాస్త్ర బద్ధమైన భారతీయ సంస్కృతిలో భాగం. కాబట్టి తెలుసుకోకుండా భారతీయు లీ విధంగా పలుకరాదు... అని ఒక గురువు శిష్యునికి చెప్పినాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి